పని కోసం వచ్చి బంగారం ఎత్తుకెళ్లిండు

పని కోసం వచ్చి బంగారం ఎత్తుకెళ్లిండు

కొమురవెల్లి, వెలుగు :  ఇంట్లో  రిపేర్​ పని చేయడానికి వచ్చిన ఓ ప్లంబర్​ అదే ఇంట్లోని 30 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండిని దోచుకొని ఉడాయించాడు.   సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన జరిగింది.  బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..   కొమురవెల్లికి చెందిన అంబడిపల్లి నాగరాజు  తన  ఇల్లు రిపేర్​ కోసం  అదేగ్రామానికి చెందిన మేడికుంట మల్లేశంను పిలిచాడు. రిపేర్​ పనులు ఉండడంతో కుటుంబసభ్యులు ఇంటి సామాన్లను, వస్తువులను, బంగారు ఆభరణాలను సర్ది బంగ్లాపై ఉన్న మరో రూమ్​లో భద్రరిచారు.  శనివారం ప్లంబర్​ మల్లేశంవచ్చి,  పని అయిపోయినట్టు నాగరాజు భార్య అర్చనకు తెలిపాడు.  

ఇంటిపైన  పని చేసిన సామాన్లు ఉన్నాయని చెప్పిన మల్లేశం.. పైకి వెళ్లి,  ఓ బ్యాగ్​తో బయటకు వెళ్లాడు.  కొద్ది సేపటి తర్వాత  అర్చన బంగ్లాపైకి వెళ్లింది. ఇంటి సామాన్లు  భద్రపరిచిన గది తాళం పగలగొట్టి ఉంది. అది గమనించిన అర్చన లోపలికి వెళ్లి చూడగా.. బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు  బాక్స్​ తాళం కూడా పగిలి ఉంది.  చోరీ జరిగిందని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులకు  సమాచారం ఇచ్చింది.  మల్లేశంపై అనుమానంతో అతడికి ఫోన్​ చేసి ఇంటికి రమ్మన్నారు. తర్వాత మళ్లీ ఫోన్​ చేయగా ఫోన్​ అందుబాటులోకి రాలేదు. దీంతో  నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని  ఎస్సై చంద్రమోహన్ పరిశీలించారు. కేసు నమోదు చేసి,   నిందితుడి కోసం వెతుకుతున్నామన్నారు.