- ఓట్ల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తారా అని నిలదీత
- చొరబాటుదారులను వెళ్లగొట్టే టైమొచ్చిందని కామెంట్
- ‘మహా జంగల్ రాజ్’ సర్కార్ను గద్దె దింపాలని పిలుపు
- బెంగాల్, అస్సాంలో ప్రధాని ర్యాలీలు
సింగూర్: దేశ భద్రతకు బెంగాల్ సర్కార్ ముప్పు కలిగిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ‘‘బెంగాల్లోని తృణమూల్ సర్కార్ దేశ భద్రతతో ఆటలాడుతున్నది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చొరబాటుదారులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నది” అని ఆరోపించారు. ఆదివారం బెంగాల్లోని సింగూర్, అస్సాంలోని కలియాబోర్లో నిర్వహించిన ర్యాలీల్లో మోదీ పాల్గొని మాట్లాడారు. బెంగాల్లో చొరబాటుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సహకారం అందజేస్తున్నదని ఆయన ఆరోపించారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వ అండదండలతో బార్డర్ వెంబడి అక్రమ వలసదారులు తిష్ట వేశారు. వాళ్లను కాపాడేందుకు సర్కార్ ఎంత నీచానికైనా దిగజారుగుతున్నది. చొరబాటుదారులకు షెల్టర్ ఇవ్వడంతో పాటు ఫేక్ డాక్యుమెంట్లను అందజేస్తున్నది. మన దేశంలోకి చొరబాటుదారులు రాకుండా బార్డర్లో ఫెన్సింగ్ వేస్తామంటే తృణమూల్ సర్కార్ ఒప్పుకోవడం లేదు. అందుకు అవసరమైన భూమి ఇవ్వడం లేదు” అని మండిపడ్డారు.
ఇకపై చొరబాట్లను సహించేది లేదని తేల్చి చెప్పారు. చొరబాటుదారులను గుర్తించి, వాళ్లను వెనక్కి పంపాల్సిన టైమొచ్చిందని అన్నారు. అది బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ‘‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా అదుపు తప్పింది. మహిళలపై నేరాలు పెరిగిపోయాయి. అవినీతి, అక్రమాలు, దందాలు ఎక్కువయ్యాయి. సిండికేట్ ముఠాలు, మాఫియాలు రాజ్యమేలుతున్నాయి.
ఇవన్నీ అంతమవ్వాలంటే బీజేపీకి ఓటు వేయండి. తృణమూల్ నేతృత్వంలోని ‘మహాజంగల్ రాజ్’ సర్కార్ను గద్దె దించండి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. తమను అధికారంలోకి తీసుకొస్తే చొరబాట్ల సమస్యను నివారించి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ను జనం తిరస్కరిస్తున్నరు..
కాంగ్రెస్ పాలనలో అస్సాంలోని భూభాగాన్ని చొరబాటుదారులకు అప్పగించారని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘‘అస్సాంను కాంగ్రెస్ దశాబ్దాల పాటు పాలించింది. ఆ టైమ్లో చొరబాట్లు పెరిగిపోయాయి. అక్రమ వలసదారులు అడవులను ఆక్రమించుకున్నారు. చొరబాటుదారులు స్థానిక సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీస్తున్నారు.
పేదలు, యువత జాబ్స్ను లాక్కుంటున్నారు. గిరిజనుల భూములను గుంజుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లంతా అస్సాం, జాతీయ భద్రతకు ముప్పుగా మారారు” అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చొరబాటుదారులను కాపాడి, అధికారంలోకి రావడమే ఆ పార్టీ పని. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా ఇదే పాలసీని అమలు చేస్తున్నాయి.
బిహార్ ఎన్నికల సందర్భంగా చొరబాటుదారులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. కానీ అక్కడి ప్రజలు వాళ్లను తిరస్కరించారు. మీరు కూడా కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలి” అని పిలుపునిచ్చారు. ‘‘దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ జనం బీజేపీకే మద్దతు ఇచ్చారు. ప్రజలు అభివృద్ధి, సుపరిపాలననే కోరుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీల కుటిల రాజకీయాలను తిరస్కరిస్తున్నారు” అని పేర్కొన్నారు.
