
- ఓ 70 ఏండ్ల నేత పాదాల వద్ద ఆయన ఫొటో ఉంచింది: మోదీ
- దళిత ఐకాన్ను అగౌరవపరిస్తే బిహార్ ప్రజలు సహించరు
- ఎన్డీయే హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని కామెంట్
సివాన్(బిహార్): రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను ఆర్జేడీ అవమానించిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. దళిత ఐకాన్ను అగౌరవపరిస్తే బిహార్ ప్రజలు సహించబోరని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బిహార్లో శుక్రవారం ఆయన పర్యటించారు. 5,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
వందే భారత్ రైలుకు జెండా ఊపిన తర్వాత సివాన్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో దాదాపు 45 నిమిషాల పాటు ప్రసంగించారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే బిహార్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడంలో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు.
త్వరలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జేడీ, దాని కూటమి పార్టీలపై మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘ వారసత్వ పాలనను అంబేద్కర్ వ్యతిరేకించారు. కానీ వారు (ఆర్జేడీ, కాంగ్రెస్) అంబేద్కర్ ఆలోచనను ఇష్టపడరు. అందుకే ఆయన ఫొటోను అనారోగ్యంతో ఉన్న ఓ 70 ఏండ్ల నేత (లాలూ ప్రసాద్ యాదవ్) పాదాల సమీపంలో ఉంచారు.
అంబేద్కర్ను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వెలిసిన పోస్టర్లు దారివెంట నాకు కనిపించాయి” అని పేర్కొన్నారు. కానీ.. వారు క్షమాపణ చెప్పలేదని, ఎందుకంటే వారికి దళితులంటే వారికి ఇష్టంలేదని అన్నారు. అణగారిన కులాలు, దళితులు, ఓబీసీలు, ఈబీసీల పై ఆర్జేడీ, కాంగ్రెకు గౌరవం లేదని అన్నారు. అంబేద్కర్ తన గుండెల్లో ఉంటారని, అందుకే ఆయన ఫొటోను తన చాతీకి దగ్గరగా పెట్టుకున్నానని చెప్పారు.
ప్రజలను పేదరికంలోకి నెట్టారు..
బిహార్ను ‘లైసెన్స్ రాజ్’ సుదీర్ఘ కాలం పేదరికంలోనే ఉంచిందని ఆర్జేడీని ఉద్దేశించి మోదీ అన్నారు. దేశంలో పేదరికానికి కూడా కాంగ్రెస్ ‘లైసెన్స్ రాజ్’ కారణమని పేర్కొన్నారు. ఆ పార్టీ నేతల కుటుంబీకులు ధనవంతులు కాగా.. సామాన్యులు మాత్రం పేదలుగానే మిగిలిపోయారని ఫైర్ అయ్యారు. తమ ఎన్డీయే సర్కారు ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ అని నినదిస్తుంటే.. ఆర్జేడీ, కాంగ్రెస్ మాత్రం ‘పరివార్ కా సాత్’ అంటూ వారి కుటుంబ అభివృద్ధికే ప్రయారిటీ ఇస్తున్నాయని అన్నారు. కొన్నేండ్ల క్రితం జంగిల్రాజ్ను బిహార్ ప్రజలందరూ తరిమికొట్టారని, కానీ..మళ్లీ ఈ రాష్ట్రాన్ని దోచుకునే మరో అవకాశం కోసం జంగిల్ రాజ్ చూస్తున్నదని తెలిపారు.
11 ఏండ్లలో అభివృద్ధికే అంకితం
తమ ప్రభుత్వం11 ఏండ్లలో అభివృద్ధికే అంకితమైందని ప్రధాని మోదీ అన్నారు. దేశంతోపాటు బిహార్ లోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. మర్హౌరా రైలు ఫ్యాక్టరీనే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇక్కడ తయారైన రైలు ఇంజిన్ ఆఫ్రికన్ రైలుకు శక్తినిస్తుందని, ఆఫ్రికాలోనూ బిహార్కు ప్రశంసలు వస్తాయని చెప్పారు. ఏండ్లుగా వెనుకబడ్డ సరన్ జిల్లాలోనే ఈ రైల్వే ప్రాజెక్టును ఏర్పాటు చేశామని, దీంతో ఈ జిల్లా ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందని చెప్పారు.
ట్రంప్ డిన్నర్కు పిలిస్తే పోలేదు..
ఇటీవల జీ7 సమిట్ కోసం తాను కెనడాకు వెళ్లిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ఫోన్ చేశారని ప్రధాని మోదీ వెల్లడించారు. వాషింగ్టన్కు రావాలని, వివిధ అంశాలపై చర్చించుకుని, డిన్నర్ చేద్దామని ఆయన ఇన్వైట్ చేశారని తెలిపారు. అయితే, తాను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. శుక్రవారం భువనేశ్వర్ పబ్లిక్ మీటింగ్ లో మోదీ మాట్లాడుతూ.. తాను ఒడిశాలో పర్యటించి, జగన్నాథ ప్రభువు వెలసిన పవిత్ర భూమిని సందర్శించాల్సి ఉన్నందున అమెరికాకు రాలేనని ట్రంప్ కు చెప్పానన్నారు.