నాగ్ పూర్‭లో మెట్రో సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ

నాగ్ పూర్‭లో మెట్రో సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ

నాగ్ పూర్‭లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ మెట్రోను ప్రధాని మోడీ ప్రారంభించారు. స్వయంగా టికెట్ కొనుగోలు చేసి.. ఫ్రీడమ్ పార్క్ నుంచి ఖాప్రి వరకు మోడీ మెట్రోలో ప్రయాణించారు. విద్యార్థులు, ప్రయాణికులతో మాట్లాడుతూ ఆయన మెట్రోలో ప్రయాణించారు. రూ.6,700 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్న మెట్రో రెండవ దశ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన కూడా చేశారు. 

అనంతరం నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ మధ్య నడిచే ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి ప్రముఖలు పాల్గొన్నారు. వందే భారత్ ట్రైన్ గరిష్ట స్పీడ్ గంటకు 160 కిలోమీటర్లు. శతాబ్ది ట్రైన్‌ మాదిరిగానే ఇది కూడా ఉంటుంది. అయితే ఇంకా మెరుగైన సదుపాయాలు ఇందులో ఉండనున్నాయి. ఈ ట్రైన్ హై స్పీడ్ తో పరుగులు పెడుతుంది. ఫాస్టర్ యాక్సిలేరేషన్, డీసెలెరేషన్ కారణంగా ఈ ట్రైన్ త్వరితగతిన వేగాన్ని అందుకుంటుంది. అలాగే జర్నీ టైమ్ ఏకంగా 25 నుంచి 45 శాతం వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ కొత్త తరహా ట్రైన్స్‌లో ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. అన్ని కోచ్‌లలోనూ ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్ వైఫై, కంఫర్టబుల్ సీటింగ్ వంటి ప్రత్యేకతలు ఈ ట్రైన్స్ లో ఉన్నాయి. 

బిలాస్‌పూర్ నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ విషయానికి వస్తే.. ఇది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ పరిధిలో పని చేస్తుంది. ఈ ట్రైన్‌కు రాయ్‌పూర్, దూర్గ్, గోండియా వంటి ప్రాంతాల్లో స్టాప్స్ ఉన్నాయి. ఈ ట్రైన్ వారంలో ఆరు రోజులు తిరుగుతూనే ఉంటుంది. అలాగే.. నాగ్ పూర్ లో మరికొన్ని ప్రాజెక్టులను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు.