ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినెల చివరి ఆదివారం రోజున మన్కీ బాత్ లో మాట్లాడుతారన్న విషయం తెలిసిందే. దేశ విషయాలతో పాటుగా వివిధ ప్రాంతలకు చెందిన వ్యక్తుల విజయాలపై మోడీ ఈ కార్యక్రమంలో ప్రస్తావిస్తుంటారు. మొదటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయదశమి సందర్భంగా 3 అక్టోబరు 2014న మొదలైంది. ఇప్పటివరకు ఇది 99 నెలలు పూర్తిచేసుకోగా వచ్చే అదివారం అంటే ఏప్రిల్ 30, 2023తో 100 నెలలు పూర్తి చేసుకోనుంది.
100 కోట్ల మందికి పైగా
మోడీ మన్కీ బాత్ కార్యక్రమాన్ని దేశంలో 100 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్కసారైనా విన్నారని రోహ్తక్లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్’ (ఐఐఎం) తమ అధ్యయనంలో వెల్లడించింది. దాదాపు 23 కోట్ల మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా విన్నారని తెలిపింది. ఇందులో 65 శాతం మంది హిందీలో, 44.7% మంది దీనిని టీవీ ఛానళ్లలో వింటున్నారని పేర్కొంది. 18 శాతం మంది ఇంగ్లీషుకు ప్రాధాన్యత ఇచ్చారంది. ఇక 41 కోట్ల మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని అప్పుడప్పుడు విన్నారని వెల్లడించింది.
22 భారతీయ భాషలు, 29 మాండలికాలతో
19 -నుంచి 34 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు దాదాపు 62 శాతం మంది మొబైల్ ఫోన్ ద్వారా మన్ కీ బాత్ చూడటానికి లేదా వినడానికి ఇష్టపడుతున్నారని, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న దాదాపు 3.2% మంది టెలివిజన్లో మన్ కీ బాత్ చూడటానికి ఇష్టపడతారని తమ అధ్యయనంలో వెల్లడించింది. 22 భారతీయ భాషలు, 29 మాండలికాలతో పాటు ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియా, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పష్టు, పర్షియన్, దారీ వంటి 11 విదేశీ భాషల్లో 'మన్ కీ బాత్' ప్రసారమవుతోందని ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ ద్వివేది తెలిపారు. ఆల్ ఇండియా రేడియోలోని 500కి పైగా కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నట్లు ద్వివేది తెలిపారు.
100వ ఎపిసోడ్లో రూ.100 నాణెం
ఏప్రిల్ 30న జరగనున్న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్లో రూ.100 నాణెం విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ కాయిన్పై మైక్రోఫోన్ సింబల్ ఉంటుంది. దీనిపై 2023 అని ప్రింట్ చేసి ఉంటుంది. దీనిని వెండి, రాగి, నికెల్, జింక్తో తయారు చేశారు. ఈ కాయిన్ బరువు 35 గ్రాములు ఉండనుంది.రూ. 100 కాయిన్ను విడుదల చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ అనేక సందర్భాల్లోనూ రూ.100 కాయిన్ ను ఆర్బీఐ ప్రింట్ చేసింది.