- రేపు నాగర్కర్నూల్లో బహిరంగ సభ
- 18న జగిత్యాలలో జరిగే సభకూ హాజరు
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. శుక్రవారం సాయంత్రం 5:15 నుంచి 6:15 గంటల వరకు మల్కాజ్గిరిలోని మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్ ఖరారైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గురువారం తెలిపారు. మోదీ శుక్రవారం సాయంత్రం 4:50 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మల్కాజ్ గిరికి చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు.
దీనికి హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల నుంచి కనీసం 50 వేల మందిని తరలించాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. రోడ్ షో అనంతరం మోదీ సోమాజిగూడలోని రాజ్భవన్కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నాగర్ కర్నూల్ కు వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడుతారు. అనంతరం ఒంటిగంటకు అక్కడి నుంచి గుల్బర్గాకు వెళ్తారు. కాగా, ఈ నెల18న జగిత్యాలలో జరిగే బహిరంగ సభలోనూ మోదీ పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు.