ముగిసింది లాక్‌డౌన్ మాత్రమే.. కరోనా కాదు.. జాగ్రత్తలు మరవద్దు: మోడీ

ముగిసింది లాక్‌డౌన్ మాత్రమే.. కరోనా కాదు.. జాగ్రత్తలు మరవద్దు: మోడీ

కరోనా వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. దేశంలో లాక్‌డౌన్ మాత్రమే ముగిసిందని, కరోనా వైరస్ ఇంకా ఉందని ప్రజలు గుర్తెరిగి ఉండాలని సూచించారు. ఏడెనిమిది నెలల పాటు కరోనాపై మనం చాలా విజయవంతంగా పోరాడుతున్నామని, వైరస్ మళ్లీ విజృంభించకుండా చూసుకోవాలని చెప్పారు.

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రసంగించారు. దసరా, దీపావళి, ఛట్ పూజ వంటి పంగుడల సీజన్‌లో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారిపై భారత్ సక్సెస్ ఫుల్‌గా పోరాడుతోందన్నారు. దేశంలో దాదాపు 90 లక్షలకు పైగా కరోనా బెడ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 2 వేలకు పైగా కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయని, కొద్ది రోజుల్లోనే దేశంలో కరోనా టెస్టుల సంఖ్య పది కోట్లను దాటబోతోందని అన్నారు. కరోనా టెస్టుల సంఖ్య పెరగడమంటే వైరస్‌పై పోరాటంలో మన బలం మరింత పెరుగుతున్నట్టేనని మోడీ చెప్పారు.

కరోనా వైరస్ బారి నుంచి కోలుకుంటున్న వారి రికవరీ రేటు మన దేశంలో చాలా మెరుగ్గా ఉందని ప్రధాని అన్నారు. అమెరికా, బ్రెజిల్, యూకే వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉందని మోడీ తెలిపారు. అమెరికా లాంటి దేశాల్లో ప్రతి పది లక్షల మందిలో 600 మందికి పైగా కరోనాకు బలవుతున్నారని, భారత్‌లో ఈ సంఖ్య 83 మాత్రమేనని చెప్పారు. మన దేశంలో ప్రతి పది లక్షల మందిలో 5500 మందికి కరోనా వచ్చింది, అయితే అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ఈ సంఖ్య 25 వేలకు పైగా ఉందని అన్నారు.

కరోనాపై జనతా కర్ఫ్యూ మొదలు ఏడెనిమిది నెలలుగా పోరాడుతున్నామని, ఇప్పుడిప్పుడే ఎకానమీ పుంజుకుంటోందని మోడీ అన్నారు. ప్రజలంతా ధైర్యంగా వాళ్ల భాద్యతను, రోజు వారీ పనులను చూసుకునేందుకు యటకు వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం పండుగల సీజన్‌లో మార్కెట్లకు కొత్త కళ వచ్చిందని అన్నారు. అయితే లాక్ డౌన్ మాత్రమే ముసిగిందని, కరోనా వైరస్ ఎక్కడికీ పోలేదన్న విషయం మనమంతా గుర్తుంచుకోవాలని ఆయన అప్రమత్తం చేశారు. కరోనా వైరస్ బారినపడకుండా అన్ని రకాల జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని సూచించారు. అజాగ్రత్తగా వ్యవహరించి మళ్లీ కరోనా మహమ్మారి విజృంభించే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ‘కొంతమంది జనం గుమ్మిగూడి, ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతున్న వీడియోలు, ఫొటోలు కొన్ని ఇటీవలే చూశాం. ఆ తరహా ప్రవర్తన మనకే డేంజర్. మాస్కు లేకుండా బయటకు వస్తున్నారంటే మీ కుటుంబం మొత్తాన్ని రిస్క్‌లో పెడుతున్నారని గుర్తుంచుకోవాలి. యూరప్ దేశాల్లోనూ కొన్ని చోట్ల కరోనా కేసులు తగ్గినా మళ్లీ సడన్‌గా భారీగా పెరిగిన సందర్భాలు ఉన్నాయి’ అని మోడీ గుర్తు చేశారు.

ప్రపంచంలో అనేక దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నాయని, వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దేశంలోని ప్రజలందరికీ వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ఆయన వివరించారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని, సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం, శానిటేషన్ లాంటివి మర్చిపోకూడదని, కరోనా వైరస్ తగ్గిపోయిందిలే అన్న భావనతో అలసత్వంతో ఉండొద్దని కోరారు ప్రధాని మోడీ. ‘పండుగలు జాగ్రత్తగా  జరుపుకోండి. దేశంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఫెస్టివల్స్ మీ జీవితాల్లో వెలుగులను, సుఖసంతోషాలను నింపాలని ఆశిస్తున్నా. అయితే ప్రతి ఒక్కరూ కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని చేతులు జోడించి కోరుతున్నా. ఏ చిన్న పొరబాటు కూడా మళ్లీ కరోనా కల్లోలంలోకి నెట్టేసే ప్రమాదం కొనితెచ్చుకోవద్దని మనవి’ అంటూ ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.