నరేంద్ర మోడీ కాదు.. సరెండర్ మోడీ: రాహుల్ గాంధీ పంచ్

నరేంద్ర మోడీ కాదు.. సరెండర్ మోడీ: రాహుల్ గాంధీ పంచ్

భోపాల్: భారత్, పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (జూన్ 3) రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‏లో పర్యటించారు. సంఘ్థాన్ సృజన్ అభియాన్ అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపు మేరకు ప్రధాని నరేంద్ర మోడీ లొంగిపోయారని ఆరోపించారు. 

ట్రంప్ ఫోన్ చేయగానే పాక్‎తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుంచి ఫోన్ చేసి -నరేందర్.. సరెండర్ అన్నారు. ఇక్కడ మోడీ వెంటనే.. ఒకే సార్ అని లొంగిపోయారు’’ అని రాహుల్ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై కొంచెం ఒత్తిడి తెచ్చినా వారు భయపడి పారిపోతారని.. అది వారికి బాగా అలవాటని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కూడా వాళ్లకు లొంగుబాటు లేఖలు రాసే అలవాటు ఉందని సెటైర్ వేశారు. 

కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదని.. ఎవరి బెదిరింపులకు తలొగ్గదని అన్నారు. గాంధీజీ, నెహ్రూజీ, సర్దార్ పటేల్జీ -వీరు లొంగిపోయే వ్యక్తులు కాదని.. అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులని హాట్ కామెంట్స్ చేశారు. కాగా, తన వల్లే భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పదే పదే  చెబుతోన్న విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో పక్షం జోక్యం లేదని.. భారత్, పాక్ మధ్య హాట్ లైన్ చర్చల ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని భారత్ క్లారిటీ ఇచ్చింది.

 కానీ ట్రంప్ మాత్రం తన వల్లే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరిందని కామెంట్స్ చేస్తున్నాడు. అయితే.. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని.. ఆయన నోరు విప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ట్రంప్ ఫోన్ కాల్ వల్లే మోడీ సరెండర్ అయ్యారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.