
- చీనాబ్, అంజిఖాడ్ బ్రిడ్జిలకు ప్రారంభోత్సవం
జమ్మూ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన తొలిసారి ఇక్కడికి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాశ్మీర్ లోయకు ప్రత్యక్ష రైలు కనెక్టివిటీని అందించే 272 కిలో మీటర్ల ఉధంపూర్–-శ్రీనగర్–-బారాముల్లా రైల్వే లింక్ పూర్తయినందుకు గుర్తుగా వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపనున్నారు. అలాగే, దేశ ఇంజినీరింగ్ నైపుణ్యానికి చిహ్నమైన చీనాబ్ వంతెనతోపాటు అంజిఖాడ్లో నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేయిడ్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.
అలాగే, త్రికూట కొండలపై ఉన్న వైష్ణో దేవి మందిరాన్ని సందర్శించే యాత్రికుల బేస్ క్యాంప్ అయిన కత్రాలో రూ.46 వేలకు కోట్లకు పైగా విలువైన మల్టీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు. కాగా, మోదీ ప్రారంభించనున్న కత్రా–శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలు సర్వీసు జూన్ 7 నుంచి అందుబాటులోకి వస్తుందని ఉత్తర రైల్వే తెలిపింది. గురువారం మధ్యాహ్నం నుంచి ఐఆర్ సీటీసీ ముందస్తు బుకింగ్ ప్రారంభించింది. కాత్రా– శ్రీనగర్ మధ్య రెండు వందే భారత్ రైళ్లు 4 ట్రిప్పులు నడపనున్నట్టు పేర్కొన్నది.