
- విమాన ప్రమాద బాధితులకు మోదీ పరామర్శ
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని
- ఫ్లైట్ క్రాష్కు గల కారణాలపై ఆరా
- అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో అధికారులతో సమీక్ష
- విజయ్ రూపానీ నివాసానికి వెళ్లి ఆయన ఫ్యామిలీని ఓదార్చిన పీఎం
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకుని నేరుగా విమానం కూలిన ప్రాంతానికి వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి గురించి ఆరా తీశారు. విమానం క్రాష్ ల్యాండ్ అయిన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు.
ప్రమాద తీవ్రతకు చుట్టు పక్కల ధ్వంసమైన భవనాలతో పాటు పార్కింగ్ ఏరియా, కాలేజ్ డైనింగ్ హాల్ ను చూశారు. విమానం కూలిన సమయంలో హాస్టల్ బిల్డింగ్లో ఎంత మంది స్టూడెంట్లు ఉన్నారు? వాళ్ల పరిస్థితి ఏంటి? ఎంత మంది చనిపోయారు? గాయపడిన వారికి అందుతున్న ట్రీట్మెంట్పై ఆరా తీశారు. సుమారు 20 నిమిషాల పాటు ఘటనా స్థలంలోనే ఉన్నారు. అనంతరం బీజే మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధిత స్టూడెంట్లు, డాక్టర్లను పరామర్శించి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాదంపై మోదీకి అధికారుల బ్రీఫింగ్
బీజే మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో గాయపడినవాళ్లను పరామర్శించాక నేరుగా మళ్లీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వెళ్లారు. అక్కడ ఏవియేషన్, స్థానిక అధికారులతో సమావేశం అయ్యారు. విమానం కూలిపోవడాని కారణమేంటి? మృతుల సంఖ్య ఎందుకంత పెరిగింది? విమానం కండీషన్తో పాటు టేకాఫ్ అయ్యాక తలెత్తిన సమస్య గురించి అధికారులంతా మోదీకి బ్రీఫ్గా వివరించారు.
విమానం క్రాష్ అయినప్పుడు 1.25 లక్షల లీటర్ల ఫ్యూయెల్ ఉన్నట్లు అమిత్ ఇప్పటికే ప్రకటించారు. దీనిపై కూడా ప్రధాని మోదీ ఆరా తీశారు. ట్యాంక్ కెపాసిటీ ఎంత? అసలు ఎందుకంతా ఫ్యూయెల్ లోడ్ చేసుకోవాల్సి వచ్చింది? టేకాఫ్ అయ్యాక విమానం పైకి వెళ్లకుండా కిందికి జారిపడిపోయేందుకు కారణమేంటి? కెపాసిటీ కంటే ఎక్కువ బరువు విమానం మోసిందా? అనే వివరాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.
రూపానీ ఫ్యామిలీకి పరామర్శ
విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని మోదీ ఆయన ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. విజయ్ రూపానితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఎన్నో సవాళ్లను కలిసి ఎదుర్కొన్నట్లు మోదీ గుర్తు చేశారు. విజయ్ రూపానీ లేనిలోటు ఎవరూ తీర్చలేరని తెలిపారు. మోదీ వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, కర్నాటక హోంమినిస్టర్ హర్ష్ సంఘ్వి ఉన్నారు.
గాయపడిన మెడికోలకు భరోసా
ఏవియేషన్ అధికారులతో సమీక్షించాక ప్రధాని మోదీ అహ్మదాబాద్ సిటీ సివిల్ హాస్పిటల్ వెళ్లారు. ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్తో మోదీ మాట్లాడారు. విమానంలో ఉన్నప్పుడు అసలేం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గాయపడిన ఇతర మెడికోలకు మోదీ ధైర్యం చెప్పారు.
తర్వాత ట్విటర్లో స్పందించారు. ఇది ఊహించని విషాదమని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. తమవాళ్లను కోల్పోయిన బాధ చాలాకాలం వెంటాడుతుందని తెలిపారు. ఆ వేదనను మాటల్లో చెప్పలేమని అన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనంతా బాధిత కుటుంబాల గురించేనని చెప్పారు.