భారత దేశం రేపటి(శనివారం) 74వ ఇండిపెండెన్స్ డే కు సిద్ధమైంది. పంద్రాగస్టు వేడుకలకు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధాని మోడీ శనివారం ఎర్రకోట వేదికగా కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మోడీ తన ప్రసంగంలో ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు ఈ పథకాన్ని చేపడుతున్నారు.
ఒన్ నేషన్-ఒన్ హెల్త్ కార్డుపై పథకంలో భాగంగా వ్యక్తికి జరిగిన చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్ర అంతటినీ డిజిటలీకరించి ఈ కార్డులో భద్రపరుస్తారు. ఆస్పత్రులు, క్లినిక్లు, డాక్టర్లను కేంద్ర సర్వర్తో అనుసంధానిస్తారు. అయితే ఈ స్కీంను ఉపయోగించుకోవాలా లేదా అనే నిర్ణయాన్ని పూర్తిగా ఆస్పత్రులు, పౌరులకే వదిలివేస్తారు. ఈ కార్డును కోరుకున్న వారికి ఓ యూనిక్ ఐడీని కేటాయిస్తారు. ఈ ఐడీ ద్వారా వారు సిస్టమ్లోకి లాగిన్ అవుతారు.
దశలవారీగా అమలు చేసే ఈ పథకానికి ఇప్పటికే రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఈ పథకం ప్రయోజనాల్లో ముఖ్యంగా దేశంలో ఏ డాక్టర్, ఆస్పత్రిని సందర్శించే వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. యూనిక్ ఐడీ ద్వారా రోగికి సంబంధించిన పూర్తి వివరాలు, రికార్డులను డాక్టర్లు పరిశీలిస్తారు. ఆధార్ కార్డు తరహాలో హెల్త్ కార్డును జారీ చేస్తారు. దేశంలో వైద్యారోగ్య పరిస్ధితిని పూర్తిగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండేలా చర్యలు చేపడతారు. ఈ స్కీంను ఆపై మెడిసిన్ షాపులు, వైద్య బీమా కంపెనీలకూ సర్వర్లో అనుసంధానిస్తారు. రోగి పర్శిషన్ తోనే డాక్టర్లు, ఆస్పత్రి వర్గాలు వ్యక్తి రికార్డులను పరిశీలించేందుకు అనుమతించనున్నారు.