ఇండియా, చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి దారులు పరుస్తాయి: పీఎం
విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకుంటాం
ఒకరి సమస్యలపై మరొకరం సున్నితంగా వ్యవహరిస్తాం
మహాబలిపురంలో డెలిగేషన్ లెవెల్ చర్చల తర్వాత మోడీ
చెన్నై: ఇండియా, చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘చెన్నై కనెక్ట్ ద్వారా మన రెండు దేశాల మధ్య కోఆపరేషన్కు సంబంధించి కొత్త శకం ఈ రోజే ప్రారంభమైంది. ఇందుకు మొన్న జరిగిన ఊహన్ సమావేశం స్ఫూర్తినిచ్చింది. కొత్త ఒరవడిని సృష్టించింది. నమ్మకాన్ని కల్పించింది” అని చెప్పారు. శనివారం మహాబలిపురంలో చైనాతో డెలిగేషన్ లెవెల్ చర్చల్లో ఆయన మాట్లాడారు. అంతకుముందు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్తో రెండో రోజు కూడా చర్చలు జరిపారు. ‘‘మా మధ్య ఉన్న విభేదాలను ముందుగానే పరిష్కరించుకుంటాం. వివాదాలుగా మారకుండా చూసుకుంటాం. ఒకరి సమస్యల విషయంలో మరొకరం సున్నితంగా వ్యవహరిస్తాం. మా సంబంధాలు ప్రపంచ శాంతి, సుస్థిరతకు దారులు పరుస్తాయి” అని
మోడీ చెప్పారు.
రెండు రోజులు.. ఆరు గంటలు
‘‘రెండు రోజుల్లో ఇద్దరు నేతలు సుమారు ఆరు గంటల సేపు డైరెక్ట్గా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. రెండు దేశాల మధ్య సహకారం, టూరిజం, బిజినెస్ లాంటి అంశాలను వాళ్లిద్దరూ చర్చించారు. బిజినెస్, ఇన్వెస్ట్మెంట్లపై కొత్త విధానం ద్వారా చర్చలు జరపాలని మోడీ, జిన్పింగ్ నిర్ణయించారు’’ అని ఫారెన్ సెక్రటరీ గోఖలే వివరించారు. రీజినల్ కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్ షిప్ విషయంలో ఇండియా ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని జిన్పింగ్హామీ ఇచ్చారన్నారు. ‘‘రెండు దేశాల భవిష్యత్తు గురించి ఆలోచించాలని మోడీ, జిన్పింగ్ చెప్పారు. టెర్రరిజం సవాళ్లను ఎదుర్కొనేందుకు కలిసి పని చేయాలని వారు అభిప్రాయపడ్డారు” అని అన్నారు.
ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్పై కొత్త మెకానిజం
ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, సర్వీసెస్పై చర్చించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు మంత్రుల స్థాయిలో కొత్త మెకానిజం ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ, జిన్పింగ్ నిర్ణయించారు. రీజినల్, గ్లోబల్ అంశాలపై చర్చించేందుకు రెండు దేశాలు సహకరించుకోవాలని, కొత్త మెకానిజం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఇనిషియేటివ్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, చైనా ఉప ప్రధాని నేతృత్వం వహిస్తారని ఫారిన్ మినిస్ట్రీ వెల్లడించింది.
చెన్నై నుంచి నేపాల్కు జిన్పింగ్
మీటింగ్ తర్వాత చైనా ప్రెసిడెంట్కు మోడీ స్పెషల్ విందు ఇచ్చారు. విందు తర్వాత జిన్పింగ్ చెన్నై నుంచి నేరుగా నేపాల్కు బయల్దేరారు. మోడీ దగ్గరుండి ఆయనకు వీడ్కోలు చెప్పారు.
‘కాశ్మీర్’ ఊసెత్తలే..
ఎజెండా లేదు… ఎన్నో మాట్లాడుకున్నారు
మోడీ, జిన్పెంగ్ రెండో రోజు చర్చలకు మహాబలిపురంలోని కోవలంలో ఉన్న తాజ్ ఫిషర్ మ్యాన్స్ కోవ్ హోటల్ వేదిక. తొలుత చైనా ప్రెసిడెంట్కు మోడీ వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత బ్యాటరీ కారులో ఇద్దరూ మీటింగ్ హాలుకు చేరుకున్నారు. ఈ మీటింగ్కు ఎలాంటి ఎజెండా లేదు. ఎలాంటి అధికారిక లాంఛనాలు లేకుండా ఈ సమావేశం జరిగింది. ఇద్దరు నాయకులు మనసువిప్పి
మాట్లాడుకున్నారు. చాలా ఇష్యూలపై ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకున్నారు. డెలిగేషన్ లెవెల్ చర్చల తర్వాత వారు
మాట్లాడారు.
మీ మర్యాదను మరిచిపోలేను: జిన్పింగ్
ప్రధాని మోడీతో జరిగిన ఇన్ఫార్మల్మీటింగ్పై చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇదో మెమరబుల్ ఎక్స్పీరియన్స్. చైనా ప్రజలపై ఎంతో ప్రభావం చూపుతుంది” అని అన్నారు. ‘‘ప్రధాని మోడీ.. నిన్న మీరు చెప్పినట్లే మనిద్దరం ఎలాంటి దాపరికం లేకుండా మిత్రుల్లా మాట్లాడుకున్నాం. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మనసు విప్పి చర్చించుకున్నాం. మీ ఆతిథ్యంతో మేం మైమరిచిపోయాం. నేను, నా సహచరులు ఎంతో ఆస్వాదించాం. ఇది మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని చెప్పారు. ఇన్ఫార్మల్ సమ్మిట్ అనేది గ్రేట్ ఐడియా అన్నారు. చైనా, ఇండియా భవిష్యత్లో కూడా ఇలాంటి ఇన్ఫార్మల్ మీటింగ్స్ జరుపుతాయని ప్రకటించారు.
చైనా నేతకు.. చేనేత
చైనా ప్రెసిడెంట్జిన్పింగ్కు ప్రధాని మోడీ అదిరిపోయే గిఫ్టు ఇచ్చారు. ఆయన చిత్రాన్ని వేసిన చేనేత పట్టు బట్టను కానుకగా అందజేశారు. జిన్పింగ్ బొమ్మను, పక్కన డిజైన్లను బంగారు పోగులతో అల్లారు. కమ్యూనిస్టు దేశమైన చైనా జాతీయ జెండా రంగు ఎరుపు. దీంతో బట్టని కూడా ఎరుపు రంగు పట్టు దారంతో రూపొందించారు. పట్టు వస్త్రం గురించి మోడీ వివరిస్తుండగా.. జిన్పింగ్ శ్రద్ధగా విన్నారు. ఈ మల్బరి పట్టు బట్టను కోయంబత్తూరు జిల్లా సిరుముగైపూడూర్లో ఉన్న శ్రీరామలింగ సౌదాంబిగై చేనేతకారుల కోఆపరేటివ్ సొసైటీకి చెందిన కార్మికులు రూపొందించారు. జిన్పింగ్ బొమ్మ, చుట్టూ అందమైన కళాకృతులను రూపొందించేందుకు చేనేత కార్మికులకు ఐదురోజులు పట్టిందట. మోడీ కానుకకు బదులుగా జిన్పింగ్ కూడా గిఫ్టు ఇచ్చారు. మోడీ బొమ్మతో ఉన్న మొమెంటో అందజేశారు. అంతకుముందు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ను ఇద్దరు నేతలు చూశారు. హ్యాండీక్రాఫ్టులను పరిశీలించారు. నేతకారులు వస్త్రాలు నేయడాన్ని ఆసక్తిగా చూశారు. తాజ్ ఫిషర్మాన్ కేవ్ లోని బుద్ధుడి స్టాచ్యూను సందర్శించారు.