కరీంనగర్​ జిల్లాలో దళిత యువకుడిపై  పోలీసుల దాడి వీడియో వెలుగులోకి

కరీంనగర్​ జిల్లాలో దళిత యువకుడిపై  పోలీసుల దాడి వీడియో వెలుగులోకి
  • సైదాపూర్  ట్రైనీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల మూకుమ్మడి దాడిని రికార్డు చేసిన వాహనదారుడు
  • ఇప్పటికే ఈ ఘటనపై అడిషనల్ డీజీపీ, సీపీకి నేషనల్  ఎస్సీ కమిషన్  నోటీసులు 
  •  చర్యలు తీసుకోవడంలో పోలీస్  ఉన్నతాధికారుల నిర్లక్ష్యం పై విమర్శలు

కరీంనగర్/హుజురాబాద్, వెలుగు: కరీంనగర్​ జిల్లా సైదాపూర్  మండలం సోమారం గ్రామ శివారులో ట్రైనీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి దళిత యువకుడు బత్తుల మహేందర్ పై దాడి చేసిన ఘటనలో కీలక ఆధారం బయటికొచ్చింది. మే 8న ముగ్గురు కలిసి బూతులు తిడుతూ మూకుమ్మడిగా దాడి చేస్తున్న ఘటనను అటుగా కారులో వెళ్తున్న వ్యక్తి ఒకరు వీడియో తీయగా.. ఈ వీడియోను కాంగ్రెస్  నాయకుడు తిప్పారపు సంపత్  మంగళవారం విడుదల చేశారు.

ఇప్పటికే ఈ వివాదంలో నేషనల్  ఎస్సీ కమిషన్  రాష్ట్ర అడిషనల్ డీజీపీకి, కరీంనగర్ సీపీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సైదాపూర్  మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్  చుట్టుపక్కల గ్రామాల్లో కూల్ డ్రింక్స్  సప్లై చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 8న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మొలంగూర్  నుంచి సైదాపూర్ కు మోపెడ్​పై వస్తుండగా, సోమారం గ్రామ శివారులో డ్రంక్  అండ్  డ్రైవ్  టెస్టు కోసం పోలీసులు ఆపారు.

మహేందర్ ను పక్కకు నిల్చోమన్నారు. అతడికి ఇంటి నుంచి ఫోన్  రావడంతో మాట్లాడుతుండగా.. ఎవరితో మాట్లాడుతున్నావంటూ ట్రైనీ ఎస్సై భార్గవ్  అతడిపై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత కానిస్టేబుళ్లు ఆకాశ్ రెడ్డి, రవికుమార్  ఎస్సైతో కలిసి చేతులు, లాఠీలతో దాడి చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొట్టవద్దని వేడుకుంటున్నా.. ట్రైనీ ఎస్సై కాలితో తన్నడం వీడియోలో కనిపిస్తోంది.

చర్యలు తీసుకోవడంలో తాత్సారం.. 

తనపై ట్రైనీ ఎస్సై భార్గవ్, ఇద్దరు కానిస్టేబుళ్లు దాడి చేశారని బాధితుడు మహేందర్  మే 14న సీపీకి, ఆ తర్వాత నేషనల్  ఎస్సీ కమిషన్ కు  ఫిర్యాదు చేశారు. దాడిలో తన తల, చెవిపై బలమైన గాయమైందని, చెవి కర్ణభేరి పగిలిపోయినట్లు రిపోర్టులు అందజేశాడు. దీంతో హుజురాబాద్  ఏసీపీకి విచారణ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు అందడంతో కమిషన్  రాష్ట్ర డీజీపీ, కరీంనగర్  సీపీకి నోటీసులు జారీ చేసింది. దాడి జరిగి నెల రోజులు కావొస్తున్నా పోలీస్  ఉన్నతాధికారులు ట్రైనీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

దెబ్బలకు ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి? 

సైదాపూర్  ట్రైనీ ఎస్సై భార్గవ్  దళితుడిని చితకబాదిన ఘటనపై అనేక సాక్షాలు జత చేస్తూ ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్ మెంట్  ఇన్ చార్జి తిప్పారపు సంపత్  ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై భార్గవ్ కు కొట్టే హక్కు ఏ రాజ్యాంగంలో, ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. ఎస్సై భార్గవ్, కానిస్టేబుళ్లు ఆకాశ్​రెడ్డి, రవికుమార్ పై హత్యాయత్నం కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.