- సాయికృష్ణ, దేవరాజ్ తీరుతోనే నటి ఆత్మహత్య
- అంచనాకొచ్చిన పోలీసులు
- వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన దేవరాజ్
- రెస్టారెంట్ లో శ్రావణి, దేవరాజ్ పై దాడి చేసిన సాయికృష్ణ
హైదరాబాద్, వెలుగు: టీవీ ఆర్టిస్ట్ శ్రావణి సూసైడ్ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సాయికృష్ణ, దేవరాజ్ ఇద్దరూ వేధించడం వల్లే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు అంచనాకు వచ్చారు. శ్రావణికి సాయికృష్ణ, దేవరాజ్ లతో ఫ్రెండ్ షిప్ ఉందని.. ఈ క్రమంలో వివాదాలు తలెత్తాయని గుర్తించారు. తమ అదుపులో ఉన్న దేవరాజ్ నుంచి ఎస్ఆర్ నగర్ పోలీసులు శుక్రవారం కీలక వివరాలు రాబట్టారు. శ్రావణి మొదట సాయికృష్ణతో ఫ్రెండ్ షిప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దేవరాజ్ పరిచయం కావడంతో సాయికృష్ణను దూరం పెట్టిందని, దీంతో ముగ్గురి మధ్య గొడవలు మొదలయ్యాయని గుర్తించారు. ఈ క్రమంలో శ్రావణి కుటుంబసభ్యుల సహకారంతో సాయికృష్ణ జూన్ 22న దేవరాజ్పై ఆమెతోనే ఎస్సార్నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించినట్లు తెలిసింది. అదే విధంగా ఈ నెల 7న శ్రీకన్య రెస్టారెంట్లో దేవరాజ్, శ్రావణిలపై సాయికృష్ణ దాడి చేసినట్లు పోలీసులకు తెలిసింది. ఆ గొడవకు సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించారు. సాయికృష్ణను శనివారం స్టేషన్కు రావాలని ఆదేశించారు.
ఆడియోలు, వీడియోలు స్వాధీనం..
శ్రావణితో సాయికృష్ణ, దేవరాజ్ చనువుగా ఉన్న ఫొటోలు, వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని కాల్ రికార్డులను కూడా సేకరించారు. శ్రావణి, దేవరాజ్కి మధ్య జరిగిన ఆడియో రికార్డ్స్, శ్రావణి కుటుంబ సభ్యులు అందజేసిన ఫొటోలు, సెల్ఫీ వీడియోలతో ఆమె సూసైడ్ కు గల కారణాలపై పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. జూన్లో జైలు నుంచి విడుదలైన దేవరాజుతో శ్రావణి మళ్లీ ఫ్రెండ్షిప్ చేసినట్లు తెలిసింది. దేవరాజ్కు ఇప్పటికే చాలామంది యువతులతో ఫ్రెండ్షిప్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తనను దూరం పెట్టిన శ్రావణిని దేవరాజ్ తనవద్ద ఉన్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసినట్లు వివరాలు సేకరించారు. మొత్తానికి శ్రావణి సూసైడ్ కు సాయికృష్ణ, దేవరాజ్ ఇద్దరూ బాధ్యులేననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేవరాజ్ స్పెషల్: శ్రావణి
ఆగస్టు 9న దేవరాజ్ బర్త్ డే సందర్భంగా శ్రావణి పంపిన వీడియో మెసేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో దేవరాజ్ తన ఫేవరెట్ హీరోగా చెప్తూ శ్రావణి బర్త్డే విషెస్ చెప్పింది. తనకు ఎంతోమంది పరిచయమైనా దేవరాజ్ మాత్రమే స్పెషల్ అని తెలిపింది. ఇప్పటి వరకు దేవరాజ్లో ఏ మిస్టేక్ చూడలేదని, తన ఫ్యామిలీ మెంబర్లా ఉంటాడని సెల్ఫీ వీడియో పంపింది. తన గురించి ప్రతి నిమిషం ఆలోచిస్తాడంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.