
- అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్ హంగామా
- ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు
- ఫ్యాన్స్ దాడిలో ఆరు బస్సులు డ్యామేజ్
హైదరాబాద్, వెలుగు: బిగ్బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆదివారం అర్ధరాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు రెచ్చిపోయి ఆరు సిటీ బస్సులపై దాడిచేసి అద్దాలు పగులగొట్టారు. బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట పోలీస్ వెహికల్ తో పాటు బెటాలియన్ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద హంగామా సృష్టించారు. ఇరు వర్గాల రాళ్ల దాడిలో పలు కార్ల అద్దాలు పగిలిపోయాయి. రన్నరప్గా నిలిచిన అమర్ దీప్ కారుపై కూడా కొందరు దాడి చేశారు. పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానులను అక్కడి నుంచి పంపించేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి తన ఫ్యామిలీతో అమర్దీప్ బయటకు వస్తున్న క్రమంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అతన్ని చుట్టుముట్టారు. కారు ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకుని అద్దాలు పగులగొట్టారు. దీంతో అమర్దీప్, ప్రశాంత్ అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఇది చివరికి రాళ్లు రువ్వుకోవడం వరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు.
పిచ్చి పిచ్చి చేష్టలు వేస్తే ఊరుకోం: సజ్జనార్
అభిమానం పేరుతో పిచ్చి పిచ్చి చేష్టలు వేస్తే ఊరుకోమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఇదేం అభిమానం అని మండిపడ్డారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశామని ట్విట్టర్లో తెలిపారు. ‘‘ఆరు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి చేష్టలు సమాజానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి ఘటనలు ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించదు” అని అన్నారు.
బిగ్ బాస్ అరాచకమైన షో : నారాయణ
బిగ్ బాస్ షో ఒక అరాచకమైన షో అని, దానికి పర్మిషన్ ఇవ్వడమే తప్పని సీపీఐ నేత నారాయణ అన్నారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద యువకులు కొట్టుకున్నారని, బస్సులపై దాడులు కూడా చేశారని తెలిపారు. కొట్లాటకు ఆ షోనే కారణమని, దాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.