- అఘాయిత్య కేసు బాధితురాలి ఫొటోలు బయటపెట్టారని రఘునందన్ రావుపై..
- విద్వేషాలు రెచ్చగొట్టారంటూ రాజాసింగ్పై
హైదరాబాద్ , వెలుగు:బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్పై మంగళవారం పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ ఘటనలో బాలిక ఫొటోలు, వీడియోలను ప్రచారం చేశారని 228 ఏ ఐపీసీ కింద దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్పై అబిడ్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కేసు దర్యాప్తు తర్వాత 41(ఏ) సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బెంజ్కారులో బాధితురాలిపై జరిగిన అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వివరాలను రఘునందన్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. పోక్సో చట్టం ప్రకారం బాధితురాలి వివరాలు బహిర్గతం చేయకూడదనే సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారంటూ అడ్వకేట్ కారం కొమ్మిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యాయవాద వృత్తిలో ఉండి అత్యాచార బాధితురాలి వివరాలు బయటపెట్టిన రఘునందన్ రావుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. వీడియోలు ఎక్కడి నుంచి ఎవరు షేర్ చేశారు అనే వివరాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రఘునందన్ రావు నుంచి వివరణ తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
అజ్మీర్ దర్గాపై కామెంట్స్ చేశాడని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై కంచన్బాగ్ ఠాణాలో కేసు నమోదైంది. మత విద్వేశాలు రెచ్చగొట్టేలా, మత విశ్వాసాలను కించపరిచేలా కామెంట్లు చేశారంటూ కంచన్బాగ్కు చెందిన మహమూద్ అలీ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అజ్మీర్ దర్గాపై విశ్వసనీయత కోల్పోయేలా గతంలో రాజాసింగ్ మాట్లాడరని పోలీసులకు తెలిపారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున చట్టపరమైన చర్యలు తీసుకోలని కోరారు. మహమూద్ అలీ ఫిర్యాదుతో పోలీసులు రాజా సింగ్పై ఐపీసీ సెక్షన్ 295 ఏ కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వర్
తెలిపారు.