కొన్ని గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు కిడ్నాపైన చిన్నారి

కొన్ని గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు కిడ్నాపైన చిన్నారి

హైదరాబాద్: కిడ్నాపైన మూడేళ్ల చిన్నారిని 20 గంటల్లో సేఫ్ గా వెతికిపట్టుకున్నారు. అఫ్జల్ గంజ్ పీఎస్ పరిధిలో శనివారం రాత్రి 9.30 గంటలకు MGBS లో మూడేళ్ళ చిన్నారి అవంతిక కిడ్నాప్ అయ్యింది. వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 7 స్పెషల్ టీమ్స్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. 20 గంటల్లో చిన్నారిని సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం మహబూబ్నగర్ రైల్వేస్టేషన్ లో కిడ్నాపర్లను(భార్యాభర్తలు) అదుపులోకి తీసుకొని చిన్నారిని కాపాడినట్లు చెప్పారు పోలీసులు.

కిడ్నాప్ కేసును చేధించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడ్డాయన్నారు. అయితే కిడ్నాపర్లైన దంపతులకు పెళ్లై ఆరేళ్ళైనా  పిల్లలు కాకపోవడంతోనే చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు మహబూబ్నగర్, సంగినాయిపల్లికి చెందిన శివుడు, పార్వతమ్మ చెబుతున్నారని తెలిపారు పోలీసులు.  నిందితుడు శివుడిపై గతంలో సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులున్నాయని.. జైలుకు కూడా వెళ్లి వచ్చాడని చెప్పారు పోలీసులు. శివుడు, పార్వతమ్మలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తక్కువ సమయంలోనే తమ బిడ్డను క్షేమంగా అప్పగించిన పోలీసులకు థాంక్స్ చెప్పారు అవంతిక తల్లిదండ్రులు.