
- ఒక్కో సిరప్ బాటిల్పై రూ.2.5 కమీషన్
- పోలీసులకు వెల్లడించిన నిందితుడు
- దగ్గు మందు ప్రమాదమని తెలిసినా ప్రిస్క్రైబ్ చేసినట్లు వాంగ్మూలం
భోపాల్: చిన్నారుల మరణాలకు కారణమైన కోల్డ్రిప్ దగ్గు సిరప్ను ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్కు.. ఫార్మా కంపెనీ 10% కమీషన్ ఇచ్చిందని పోలీసులు వెల్లడించారు. అలా ఒక్కో బాటిల్పై ఆయనకు రూ.2.5 వచ్చాయని వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్గా పనిచేస్తున్న ప్రవీణ్ సోని, డ్యూటీ తర్వాత నిర్వహిస్తున్న ప్రైవేటు క్లినిక్ నుంచి ఈ సిరప్ను పిల్లలకు సూచించేవాడని తెలిపారు.
ప్రిస్క్రైబ్ చేసిన సిరప్ను విక్రయించే మెడికల్ షాపులు కూడా ఆయన భార్య, మేనల్లుడు నిర్వహిస్తున్నవేనన్నారు. దగ్గు మందుతో చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారన్న వార్తలు వచ్చినా డాక్టర్ ఆ సిరప్ను ప్రిస్క్రైబ్ చేస్తూనే ఉన్నాడని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో మరణించిన 23 మంది పిల్లల్లో చాలామందికి ఆయనే సిరప్ సూచించినట్లు తెలిసిందన్నారు.
కల్తీ కోల్డ్రీఫ్ సిరప్ తాగి మధ్యప్రదేశ్లో 23 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన కేసులో ఇప్పటికే డాక్టర్ ప్రవీణ్ సోని, కోల్డ్రిప్ సిరప్ తయారు చేసిన శ్రేషన్ ఫార్మా కంపెనీ ఓనర్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. కాగా, భారత్లో తయారవుతున్న మూడు దగ్గు సిరప్లపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరికలు జారీ చేసింది.