జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్లోని ప్రముఖ రెస్టారెంట్ ‘తెలుగు మీడియం కిచెన్’లో కుళ్లిన వాసన వస్తున్న చికెన్ వడ్డించిన ఘటన కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లో ఉన్న తెలుగు మీడియం కిచెన్ రెస్టారెంట్కు ఆదివారం ఒక పోలీసు అధికారి భోజనం కోసం వెళ్లారు. అక్కడ చికెన్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. సిబ్బంది తీసుకొచ్చిన ఫుడ్ దుర్వాసన వచ్చింది.
సిబ్బందిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి రెస్టారెంట్కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. దుర్వాసన వస్తున్న ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

