
వాళ్లు కానిస్టేబుళ్లు.. ఎవరైనా తప్పు చేస్తే పట్టుకోవాల్సిన వారు.. వాళ్లే గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టబడ్డారు. హైదరాబాద్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడటం సంచలనంగా మారింది. డ్యూటీలకు సెలవు పెట్టి మరీ.. డబ్బు సంపాదించాలనే ఆశతో.. ఓ కారులో ఏపీ నుంచి తెలంగాణకు గంజాయి రవాణా చేస్తూ.. హైదరాబాద్ పోలీసులకు దొరికిపోయారు. 2024, ఫిబ్రవరి 2వ తేదీ తెల్లవారుజామున వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నగర శివారులోని బాచుపల్లిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. శుక్రవారం ఉదయం తనిఖీ చేపట్టారు. అటుగా వస్తున్న ఓ వాహనాన్ని ఆపి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ గంజాయి తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరి నుండి 22 కిలోల గంజాయి పట్టుకున్నట్టు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు.
కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని ఎస్ఓటీ పోలీసులు చెప్పారు. విచారణ నిమిత్తం వారిద్దరిని బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తప్పని చెప్పాల్సిన పోలీసులే గంజాయి తరలిస్తుండడం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సీపీలు గంజాయి స్మగర్లపై ప్రత్యేక నిఘా పెట్టినా పోలీస్ శాఖలోనే అసలు దొంగలుఉండటంతో ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. మరి దీని పై పోలీస్ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.