హైదరాబాద్: ఐపీఎల్ 19లో తమ చివరి లీగ్ మ్యాచులో కాటేరమ్మ కొడుకులు బ్యాటింగ్లో విశ్వరూపం చూపించారు. సొంతగడ్డపై ఆర్సీబీతో జరిగిన మ్యాచులో పరుగుల సునామీ సృష్టించారు. ఓపెనర్ అభిషేక్ (56), క్లాసెన్ (51), ఇషాన్ కిషన్ (79) హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (26), నితీష్ కుమార్ (30) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలాందార్ రెండు, సుయాష్, కృనాల్ పాండ్యా చెరో వికెట్ తీశారు.
కాటేరమ్మ కొడుకులు దంచుడే దంచుడు
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్కు శుభారంభం దక్కింది. ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆది నుంచే దంచుడు మొదలుపెట్టారు. ఇద్దరు పోటాపోటీగా బౌండ్రీలు బాదారు. ఈ క్రమంలో దూకుడు మీదున్న హెడ్ (26)ను రసిక్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తొలి వికెట్కు 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఈ దశలో ఇషాన్తో జతకట్టిన అభిషేక్ శర్మ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వేగంగా ఆడే క్రమంలో సుయాష్ బౌలింగ్లో అభిషేక్ (56) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ దశలో జతకట్టిన ఇషాన్, క్లాసెన్ ఇన్నింగ్స్ను మరో రేంజ్కు తీసుకెళ్లారు.
తొలుత ఆచితూచి ఆడిన ఇద్దరూ ఆ తర్వాత గేర్ మార్చారు. పోటాపోటీగా ఫోర్లు, సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లలను ఊచకోత కోశారు. మాంచి ఊపుమీదున్న క్లాసెన్ (51) మరింత వేగంగా ఆడే క్రమంలో కృనాల్ పాండ్యా బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో మూడు వికెట్కు 113 పరుగుల పార్ట్నర్ షిప్ బ్రేక్ అయ్యింది.
క్లాసెన్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 12 బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్లు బాది 29 పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ ఇన్సింగ్స్ లాస్ట్ బౌల్కు ఔట్ అయ్యాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టి హైదరాబాద్కు భారీ స్కోర్ అందించాడు.
