10 రోజులు తిప్పుకొని షర్మిల పాదయాత్రకు నో చెప్పిన పోలీసులు 

10 రోజులు తిప్పుకొని షర్మిల పాదయాత్రకు నో చెప్పిన పోలీసులు 

వరంగల్‍, వెలుగు: వైఎస్‍ఆర్‍ టీపీ అధ్యక్షురాలు షర్మిల వరంగల్‍ పాదయాత్రకు పోలీసులు పర్మిషన్‍ ఇవ్వలేదు. వైఎస్‍ఆర్‍టీపీ పార్టీ ప్రతినిధులు, లీగల్‍ సెల్‍ బృందాన్ని పది రోజులపాటు తిప్పించుకున్న పోలీసులు చివరకు లా అండ్ ​ఆర్డర్​సమస్య వస్తుందనే కారణం చూపుతూ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. పాదయాత్రలో భాగంగా నవంబర్‍ 26న వరంగల్‍ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డి పై ఆయన సొంత ఊరు నల్లబెల్లి లో షర్మిల విమర్శలు, ఆరోపణలు చేశారు. దీంతో 28న యాత్రపై అటాక్‍ చేశారు. అదే రోజు శాంతిభద్రతల సమస్య పేరుతో లింగగిరి శంకరమ్మ తండా వద్ద పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి కోరుతూ వైఎస్‍ఆర్‍టీపీ లీడర్లు 29న హైకోర్ట్ గడప తొక్కారు. ఈ సందర్భంగా  కొన్ని షరతులతో పాదయాత్ర చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. పార్టీ వర్గాలు యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసులు మళ్లీ అనుమతి నిరాకరించారు.

డిసెంబర్‍ 4న షర్మిల పాదయాత్రకు పర్మిషన్‍ ఇచ్చే విషయమై సమాధానం చెప్పాలంటూ షోకాజ్‍ నోటీసులు ఇచ్చారు. 5న పార్టీ వరంగల్‍ జిల్లా లీడర్లు, పార్టీ లీగల్‍ సెల్‍ బృందం వరంగల్‍ కమిషనర్​ రంగనాథ్‍ను కలిసి వివరణ ఇచ్చారు. 48 గంటల్లో నిర్ణయం చెబుతామనగా గురువారం మధ్యాహ్నం  కమిషనరేట్‍కు వెళ్లి  సీపీని కలవగా సాయంత్రం రమ్మన్నారు. 5 గంటలకు వెళ్లగా..అనుమతి అంశాన్ని మరో అధికారికి అప్పజెప్పారనే సమాధానం వచ్చింది. దీంతో రాత్రి 9 గంటల వరకు వేచి చూశారు. చివరకు అర్ధరాత్రి వైఎస్సార్ టీపీ లీడర్ కు నర్సంపేట పోలీసులు పర్మిషన్ ఇవ్వలేమంటూ రిజెక్ట్ లెటర్ ఇచ్చారు. దీంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు.