కిడ్నాపర్ల చెర నుండి డాక్టర్ ను కాపాడిన పోలీసులు

కిడ్నాపర్ల చెర నుండి డాక్టర్ ను కాపాడిన పోలీసులు

అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

పోలీసులను గమనించి ఇద్దరు కిడ్నాపర్ల పరారీ..

హైదరాబాద్ శివార్లలో  కిడ్నాప్ కు గురైన దంత వైద్యుడు హుస్సేన్ ను పోలీసులు కాపాడారు. హైదరాబాదు నుండి బెంగళూరుకు తరలిస్తుండగా. అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద పోలీసుల తనిఖీల్లో కిడ్నాపర్ల గ్యాంగ్ పట్టుపడింది. అయితే మరో ఇద్దరు కిడ్నాపర్లు తప్పించుకుని పరారయ్యారు. హైదరాబాద్  రాజేంద్రనగర్ వద్ద డాక్టర్ హుసేన్ ను నలుగురు కిడ్నాపర్లు బురఖాలు వేసుకుని వెళ్లి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం జరిగిన సంచలనం రేపింది. కిడ్నాపర్ల ఆచూకీ కోసం పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ… నలుదిక్కులా సమాచారం ఇచ్చారు. పట్టపగలే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఘటన కలకలం రేపింది.

హైదరాబాద్ పోలీసులు వెంటనే అప్రమత్తమై హైదరాబాద్ నుండి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అన్ని దారుల్లో పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. కర్నూలు మీదుగా బెంగళూరుకు తరలిస్తుండగా.. కర్నూలు , అనంతపురం దాటి వెళ్తున్న వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు జిల్లాలోని అన్ని రహదారులపై చెక్ పోస్టులను అప్రమత్తం చేశారు. అనంతపురం మీదుగా బెంగళూరుకు వెళ్తున్న కిడ్నాప్ గ్యాంగ్ ను రాప్తాడు వద్ద అడ్డుకున్నారు పోలీసులు. ఇద్దరు దుండగులు పరారీ కావడంతో.. మిగిలిన వారు పారిపోకుండా పోలీసులు రౌండప్ చేసేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఉపయోగించిన రివాల్వార్ తోపాటు కత్తి, మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ కు గురైన డాక్టర్ హుసేన్ ను రక్షించి బంధు మిత్రులకు.. హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ ఎక్సైజ్ అకాడమీ వద్ద క్లినిక్ నుంచి నన్ను కిడ్నాప్ చేశారు, తొలుత ఓ గదిలో నిర్భందించారు, ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేశారు, కాళ్లు, చేతులు కట్టేసి.. మొహాన్ని కప్పేసి తీసుకెళ్లారు, ఎందుకోసం కిడ్నాప్ చేసారో తెలియదని అనంతపురం జిల్లా పోలీసులతో బాధిత డాక్టర్ హుస్సేన్ చెబుతున్నట్లు సమాచారం.