
శంషాబాద్, వెలుగు: షాద్నగర్ లింగారెడ్డిగూడెం శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. క్యాసినోలో రూ.18 లక్షలు నష్టపోవడంతో ఫ్రెండ్స్ మధ్య తలెత్తిన వివాదమే హత్యకు కారణమైందని గుర్తించారు. ఏపీలోని నంద్యాల జిల్లా బండిఆత్మకూరు పరిధిలోని చిన్నదేవులపురానికి చెందిన సాయిరాహుల్(23), శాఖమూరి వెంకటేశ్ ఫ్రెండ్స్. వీరిద్దరూ కొన్నాళ్లుగా సిటీలో ఉంటున్నారు. ఆన్లైన్లో క్యాసినో ఆడే సాయి రాహుల్.. వెంకటేశ్కు కూడా అలవాటు చేశాడు. అలా వెంకటేశ్ ఆన్లైన్లో క్యాసినో ఆడి రూ.15లక్షలు కోల్పోయాడు. తర్వాత తన సూచనలతో మరో రూ.3 లక్షలు పెట్టాలని సాయి రాహుల్ చెప్పగా, వెంకటేశ్ రూ.3లక్షలు పెట్టి అవి కూడా పోగొట్టుకున్నాడు.
ఈ క్రమంలో వెంకటేశ్, సాయి రాహుల్ మధ్య గొడవలు జరిగాయి. సాయిరాహుల్ వల్లనే తాను డబ్బు మొత్తం పోగొట్టుకున్నానని, తన డబ్బు తిరిగి ఇవ్వాలని వెంకటేశ్డిమాండ్ చేశాడు. డబ్బు ఇచ్చేది లేదని, ఏం చేసుకుంటావో చేసుకోపో అని సాయిరాహుల్ తేల్చి చెప్పడంతో వెంకటేశ్ కోపంతో ఊగిపోయాడు. సూరారంలోని తన స్నేహితుడైన కార్ డ్రైవర్ సాయంతో సాయి రాహుల్ ను చంపేందుకు స్కెచ్ వేస్తాడు. హత్యకు రూ.50 వేలు సుపారీ ఇచ్చాడు.
మొత్తం రూ.2లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. కుత్బుల్లాపూర్లో కత్తులు కొని ఈ నెల12వ రాత్రి పదిన్నర గంటల సమయంలో సాయి రాహుల్ను లింగారెడ్డిగూడెంలోని నిర్మానుష ప్రదేశానికి పిలిపించాడు. మద్యం తాగి సాయిరాహుల్ను కత్తితో పొడిచి చంపేశాడు. శవాన్ని అక్కడే పడేసి పరారయ్యారు. మృతుడి చేతిపై ఉన్న ‘జై బాలయ్య’ టాటూ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడిందని శంషాబాద్ ఇన్చార్జ్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఆరాంఘర్లో నిందితుడిని
అరెస్ట్ చేశామని చెప్పారు.