సిలిండర్ పేలుడులో ఇద్దరు మృతి.. ప్రమాదంపై అనుమానాలు

సిలిండర్ పేలుడులో ఇద్దరు మృతి.. ప్రమాదంపై అనుమానాలు

జీడిమెట్ల రామిరెడ్డి నగర్ లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మృతులను జార్ఖండ్ కు చెందిన నబీదుద్దీన్ అన్సారీ (20), బీరేందర్ (35)గా గుర్తించారు. అయితే ఇది ప్రమాదం కాదు.. హత్య అని స్థానికులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాల్లో ఒకటి చాపలో చుట్టి ఉండగా.. మరొకరి ముఖం, తలపై  తీవ్రగాయాలుండటం అనుమానాలకు తావిస్తోంది.

ప్రమాదం జరిగిన గదిలో మొత్తం 8మంది జార్ఖండ్ వాసులు ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మంగళవారంలో వారిలో ఒకరు ఓ కొత్త వ్యక్తిని గదికి తీసుకురాగా.. మధ్యాహ్నం ఇదే విషయంలో రూమ్మేట్స్ మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెప్పారు. దీంతో నిందితులు సిలిండర్ లీక్ చేసి గది బయట నుంచి గడిపెట్టి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు.