
గండిపేట్, వెలుగు: తెలంగాణ పోలీస్ అకాడామీలో 53 మందికి బ్రాస్ బ్యాండ్, బిగులర్(వెలిడిక్షన్) శిక్షణ శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జితేందర్ హాజరయ్యారు. ఆగస్టు 15, రిపబ్లిక్ డే, తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఇప్పుడు శిక్షణ పొందిన టీములు ప్రదర్శనలు ఇస్తాయన్నారు.
నాలుగు నెలలు పాటు రాష్ట్రంలోని వివిధ యూనిట్ల నుంచి 53 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. క్లారినెట్, డ్రమ్స్, ట్రంపెట్, ఫ్రెంచ్ హార్న్, ట్రాంబోస్లతో ట్రైనింగ్ ఇవ్వగా ఈ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రతిభ చాటిన వారికి పురస్కారాలు, క్యాష్ రివార్డులు ఇచ్చారు. కార్యక్రమంలో అకాడమీ జాయింట్ డైరెక్టర్ డి.మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్లు ఎన్.వెంకటేశ్వర్లు, శ్రీదేవి, అసిస్టెంట్ డైరెక్టర్లు, ట్రైనీలు పాల్గొన్నారు.