కాంగ్రెస్ ​ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు: మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ ​ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు: మంత్రి పొంగులేటి

మరిపెడ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ ఉన్న  ప్రభుత్వమని, దానిని కూల్చడం ఎవరి తరం కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి మంత్రి చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఆరునూరైనా అమలు చేసి తీరుతామన్నారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీనీ ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మంత్రి   పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల్లో డోర్నకల్ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. 

అనంతరం ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్యానాయక్​ లాంటి  రావణాసురుడిని కూల్చి భారీ మెజార్టీతో తనను గెలిపించారని, అదే విధంగా ఎంపీ ఎన్నికల్లో ఆయన కుమార్తె  ఎంపీ కవితను ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. కార్యకర్తలంతా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే  భవిష్యత్​లో మంచి అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్, మాజీమంత్రి బలరాం నాయక్, పార్టీ లీడర్లు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, రాధాబాయి, మరిపెడ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ పెండ్లి రఘువీర్ రెడ్డి, యుగందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తాజుద్దీన్, రవికుమార్, హైలమల్లు పాల్గొన్నారు.