రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్

రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రిగా పొన్నం ప్రభాకర్ సోమవారం(డిసెంబర్ 18) సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా మంత్రి తన ఛాంబర్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రి పొన్నంకు ఆశీర్వచనాలు అందించారు. 

మంత్రి పొన్నం మొదటగా ఆర్టీసీ ఫైల్ పై రూ. 375 కోట్ల నిధులు విడుదల చేస్తూ.. మొదటి సంతకం చేశారు. మంత్రితో రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీ ప్రసాద్ సంతకం చేయించారు. ఆర్టీసికి మూడవ త్రైమాసిక బడ్జెట్ కింద పలు రాయితీల కోసం రూ. 375 కోట్ల నిధులు మంత్రి పొన్నం విడుదల చేశారు. అలాగే కరోనా సమయంలో మృతి చెందిన రవాణా శాఖ ఉద్యోగి పండు బాబు కుటుంబానికి రూ. 1 లక్ష పరిహారంకు సంబంధించిన ఫైల్ పై మంత్రి సంతకం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నంకు ప్రిన్సిపాల్ సెక్రటరీతో పాటుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం, మాజీ ఎంపీలు మదుయాష్కి మైనంపల్లి హనుమంతరావు, బలరాం నాయక్ అంజన్ కుమార్ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే,  పిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎసిసి సెక్రటరీలు రోహిత్ చౌదరి, విష్ణునాథ్ తదితరులు ఉన్నారు. 
 
సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్ ను హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి.. శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.