రోడ్డు ప్రమాదంలో పాపులర్ యూట్యూబర్ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో పాపులర్ యూట్యూబర్ దుర్మరణం

మధ్యప్రదేశ్ : పాపులర్ గేమింగ్ యూట్యూబర్ అభియుదయ్ మిశ్రా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 122 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహగ్‌పూర్ సమీపంలో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ ట్రక్కు మిశ్రా ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇండోర్ కు చెందిన అభియుదయ్ మిశ్రా.. గరేనా ఫ్రీ ఫైర్, పబ్ జీ తరహా మల్టీ షూటర్ మొబైల్ గేమ్స్ పై వీడియోలు అప్ లోడ్ చేస్తుంటాడు. యూట్యూబ్ లో మిశ్రాకు 1.64 మిలియన్ల సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 425k ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబర్లను ఆకట్టుకునేలా వీడియోలు చేయడం అభియుదయ్ మిశ్రా ప్రత్యేకత. రెండు వారాల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో (iamskylord69) మిశ్రా పెట్టిన సెల్ఫీనే చివరిది. అభియుదయ్ మిశ్రా మరణవార్త తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్.. చివరి సెల్ఫీకి లైక్స్, కామెంట్స్ చేస్తూ నివాళులర్పిస్తున్నారు. 

సెప్టెంబర్ 21వ తేదీన ఖజురహో నుంచి రాష్ట్ర టూరిజం బోర్డు నిర్వహించిన లాంగ్ బైక్ ర్యాలీలో అభియుదయ్ మిశ్రా కూడా పాల్గొన్నాడు. సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఈ యాత్ర ముగియాల్సి ఉంది. అయితే.. గమ్య స్థానానికి మరో రెండు కిలోమీటర్ల దూరంగా ఉండగా.. షోహగ్ పూర్ వద్ద అభియుదయ్ మిశ్రా బైక్ ను ఓ ట్రక్కు రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన మిశ్రా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.