సీలింగ్‌‌‌‌, అసైన్డ్‌‌‌‌ భూములు.. చేతులు మారుతున్నయ్‌‌‌‌

సీలింగ్‌‌‌‌, అసైన్డ్‌‌‌‌ భూములు..   చేతులు మారుతున్నయ్‌‌‌‌
  • కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూడు వేలకుపైగా పీఓటీ దరఖాస్తులు
  • ప్రొహిబిటెడ్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో ఉన్న భూములనూ రిజిస్ట్రేషన్‌‌‌‌ చేస్తున్న సబ్‌‌‌‌ రిజిస్ట్రార్లు

కరీంనగర్, వెలుగు : కరీంనగర్‌‌‌‌ జిల్లాలో నిషేధిత జాబితాలో ఉన్న వేలాది ఎకరాల సీలింగ్, అసైన్డ్‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌ యథేచ్ఛగా చేతులు మారుతున్నాయి. ఇలాంటి భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై పీవోటీ యాక్ట్‌‌‌‌ ప్రకారం నిషేధం ఉన్నా సబ్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. సాదాబైనామా, నోటరీ అగ్రిమెంట్లతో అసైన్డ్‌‌‌‌ భూములను అగ్గువకు కొట్టేశారు. అలాంటి  భూములకు పట్టాదాస్‌‌‌‌ పాస్‌‌‌‌బుక్స్‌‌‌‌ ఇవ్వాలని ఇటీవల జిల్లాలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇలాంటి పీవోటీ అప్లికేషన్లే మూడు వేలకు పైగా వచ్చాయంటే అసైన్డ్‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌ ఏ స్థాయిలో చేతులు మారాయో అర్థం చేసుకోవచ్చు. 

పీవోటీ అప్లికేషన్లే ఎక్కువ

రూల్స్‌‌‌‌ ప్రకారం అసైన్డ్, సీలింగ్‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌ అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు పేదలకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం కావొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ అసైన్డ్‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌ (ప్రొహిబిషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌) యాక్ట్‌‌‌‌ 1977 తీసుకొచ్చింది. అయినా చాలా మంది తమ అవసరాల కోసం అసైన్డ్‌‌‌‌ భూములను అమ్ముకున్నారు.  కొనుగోలుదారులు కూడా పేదలే అయితే భూములను రీఅసైన్‌‌‌‌ చేసే వెసులుబాటును ప్రభుత్వం గతంలో కల్పించింది. 2017లో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఇలాంటి అవకాశం కల్పించగా.. చాలా మంది వినియోగించుకున్నారు. 

2017 తర్వాత అసైన్డ్‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌ కొనుగోలు చేసిన వారికి ఈ వెసులుబాటు వర్తించదు. కానీ ఇటీవల నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో 2017 తర్వాత అసైన్డ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి ఆర్జీలు ఎక్కువగా వచ్చాయి. కరీంనగర్‌‌‌‌ జిల్లాలో వివిధ భూసమస్యలపై 31,124 దరఖాస్తులు వస్తే ఇందులో మూడు వేల వరకు పీవోటీకి సంబంధించిన దరఖాస్తులే ఉన్నట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 వేలకుపైగా, జగిత్యాల జిల్లాలో 1500కు పైగా పీవోటీ అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. దీన్ని బట్టి ఒక్కో జిల్లాలో వేలాది ఎకరాల అసైన్డ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికి భూమి రీఅసైన్ చేయడం తమ చేతిలో లేదని, ఎమ్మెల్యేల అధ్యక్షతన ల్యాండ్‌‌‌‌ అసైన్‌‌‌‌మెంట్‌‌‌‌ కమిటీలను నియమించాల్సి ఉంటుందని రెవెన్యూ ఆఫీసర్లు చెప్తున్నారు. 

 ప్రొహిబిటెడ్‌‌‌‌లో ఉన్న భూములకూ రిజిస్ట్రేషన్లు

జిల్లాలో ప్రొహిబిటెడ్‌‌‌‌ జాబితాలో ఉన్న సీలింగ్, అసైన్డ్‌‌‌‌ భూములను కొందరు సబ్‌‌‌‌ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఈసీలను పరిశీలిస్తే ఈ దందా 20 నుంచి 25 ఏండ్లుగా యథేచ్ఛగా నడుస్తున్నట్లు అర్థం అవుతోంది. కొత్తపల్లి పట్టణంలోని సర్వే నంబర్‌‌‌‌ 175, 197, 198లో ఉన్న 20 ఎకరాల సీలింగ్‌‌‌‌ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఇటీవల లోకాయుక్త ఆదేశాలు జారీ చేయడం, ఆదేశాలు వచ్చిన ఆర్నెళ్లకు కలెక్టర్ 476 రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇటీవల రామడుగు మండలం దేశరాజ్‌‌‌‌పల్లిలోని 406 సర్వే నంబర్‌‌‌‌లో సుమారు రూ.6 కోట్ల విలువైన 71 గుంటల సీలింగ్‌‌‌‌ భూములను ప్లాట్లు చేసి రిజిస్ట్రేషన్‌‌‌‌ చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

గతంలో స్థానికులు అనేక సార్లు కలెక్టర్‌‌‌‌కు, ఇతర రెవెన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ వ్యవహారంపై మీడియాలో వీ6లో కథనం ప్రసారం కావడంతో ఆ భూముల్లో ఆఫీసర్లు బోర్డు పాతారు. అలాగే కరీంనగర్‌‌‌‌ సిటీలో ఉన్న కొత్తపల్లి మండలంలోని రేకుర్తి రెవెన్యూ పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న సుమారు 240 సర్వే నంబర్లలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో రేకుర్తిలోని భూముల రిజిస్ట్రేషన్లు బంద్ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. 

ఫిర్యాదులు వస్తే తప్ప పట్టించుకోని యంత్రాంగం 

జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆఫీసర్లకు ఫిర్యాదులు వస్తే తప్ప చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే కొన్ని ఫిర్యాదులపై అసలు స్పందిందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సీలింగ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ అని తెలియక రూ. లక్షలు పోసి కొత్తపల్లి పరిధిలో ప్లాట్లు కొనుక్కున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీలింగ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ను రిజిస్ట్రేషన్‌‌‌‌ చేసిన సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు.