- నాలుగు రోజులుగా చీకట్లో పల్లెలు
- ఆసిఫాబాద్ జిల్లాలో కరెంట్ కష్టాలు
- వంద గ్రామాలకు పవర్ కట్
- నీళ్ల కోసం జనరేటర్లు, ఆయిల్ ఇంజన్లు
- అటకెక్కిన లాంతర్లు, పెట్రోమాక్స్లకు గిరాకీ
ఆసిఫాబాద్, వెలుగు: ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా పోయిన కరెంట్ ఇంకా రాలేదు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలోని సుమారు వంద గ్రామాల్లో 4 రోజులుగా పవర్ కట్ కొనసాగుతోంది. దీంతో ఆయా ఏరియాల్లో తాగునీటి సప్లై నిలిచిపోయింది. సెల్ఫోన్లు మూగబోయాయి. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ పనీ చేసుకోలేకపోతున్నారు. ‘టెక్నాలజీ పెరిగింది.. ఇట్లా ప్రాబ్లమ్ వస్తే అట్లా సాల్వ్ చేస్తామ’ని ట్రాన్స్కో ఆఫీసర్లు చెప్తున్నా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి వానకాలం ఇక్కట్లు తప్పట్లేదు. చిన్న వానొచ్చినా.. గట్టి గాలి వీచినా పవర్ సప్లై ఆగిపోతోంది. ఇక్కడి సబ్ స్టేషన్లలో సమస్యలొస్తే రిపేర్లకు వారాలకు వారాలు పడ్తోంది. కూలిన కరెంట్ పోల్స్ను నిలబెట్టడానికి రోజులు గడుస్తున్నాయి.
వంద గ్రామాల్లో అంధకారం
కాగజ్నగర్ డివిజన్ లోని సిర్పూర్(టి) మండలం లోనవెల్లి, లక్ష్మీపూర్ వాగు దగ్గర 33 కేవీ లైన్కు సంబంధించిన 15 కరెంట్ పోల్స్ మొన్నటి వరదల వల్ల విరిగిపడ్డాయి. ఈ రూట్లోని కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాలకు పవర్ సప్లై నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా 338 కరెంటు స్తంభాలు డ్యామేజ్ కాగా, 116 ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగాయి. వానాకాలం, సీజనల్ వ్యాధులు ప్రబలే టైమ్లో రోజుల తరబడి కరెంట్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇన్వర్టర్లు, బ్యాటరీలు కూడా పని చేయకపోవడంతో ఆయిల్ ఇంజన్లను, జెనరేటర్లను కిరాయికి తెచ్చుకుంటున్నారు. జనరేటర్లకు గంటకు రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒక డ్రమ్ము నీళ్లు నింపితే రూ. 100 వరకు తీసుకుంటున్నారు. ఇండ్లల్లో దీపాలు, క్యాండిళ్లు వెలిగిస్తున్నారు. ఎన్నడో అటకెక్కిన లాంతర్లు, పెట్రోమాక్స్ లైట్లను మళ్లీ వాడుతున్నారు. ఏసీలు, కూలర్లకు అలవాటు పడిన జనాలు ముఖ్యంగా చిన్నపిల్లలు రాత్రిళ్లు నిద్ర పట్టక అవస్థలు పడుతున్నారు. కరెంట్ మీదే ఆధారపడిన చిన్న వ్యాపారులు, మెకానిక్లు తీవ్రంగా నష్టపోతున్నారు.
కాలమే దైనా.. కటింగ్ మామూలే..
రెప్పపాటు టైమ్ కూడా పవర్ కట్ ఉండదన్న సర్కారువారి మాట ఆసిఫాబాద్ జిల్లాలో అనుభవంలోకి రావడంలేదు. మొదటినుంచి ఇక్కడ కోతలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వాన పడిందంటే ఇక గంటల పాటు కరెంట్ కరెంట్ ఉండదు. ఆఫీసర్లు స్థానికంగా ఉండకపోవడంవల్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. కరెంటు లేక తాగునీటి స్కీమ్లు పనిచేయడంలేదు. చాలా గ్రామాల్లో నల్లాలు రాక ప్రజలు తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ బావుల నుంచి మంచినీళ్లు తెచ్చుకోవాల్సివస్తోంది. మెయింటెన్స్కు లక్షల్లో ఖర్చు చేసినట్టు అధికారులు చెప్తుంటారు. కానీ ఊళ్లలో కరెంట్ వైర్లు చేతికందే ఎత్తులో వేళ్లాడుతున్నా పట్టించుకోవడంలేదు.
ఒకే లైన్తో 250 ఊళ్లకు కరెంట్
కాగజ్ నగర్ మండలం ఈస్గాం, ఆసిఫాబాద్లో రెండు 32 కేవీ సబ్ స్టేషన్లు ఉన్నాయి. కాగజ్నగర్ పారిశ్రామిక కేంద్రంగా కాగా.. ఈస్గాం పరిధిలోని ఊళ్లన్నీ గుట్టల మధ్య ఉన్నవే. ఈ గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈస్గాం సబ్స్టేషన్ నుంచి 135 కిలో మీటర్ల వరకు ఒకే లైను ద్వారా సిర్పూర్ నియోజకవర్గంలోని 250 గ్రామాలకు కరెంటు అందిస్తున్నారు. ఎక్కడ బ్రేక్ పడ్డా అన్ని ఊళ్లకు కరెంటు సప్లై ఆగిపోతోంది. సమస్యను గుర్తించి రిపేర్లు చేసేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. దీనికి తోడు స్టాఫ్ కొరత వేధిస్తోంది. జిల్లాలో 328 పోస్టులకు గాను 207 మంది పని చేస్తుండగా 121 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.