- ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి సూచన
పద్మారావునగర్, వెలుగు: బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కాలేజీలో ఐక్యూఏసీ రజతోత్సవ వేడుకల మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ‘కంప్లయన్స్ నుంచి ఎక్సలెన్స్ వరకు’ అనే అంశంపై జాతీయ సదస్సు జరగగా, ముఖ్య అతిథిగా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి మాట్లాడారు.
మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా విద్యావేత్తలు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటేనే పోటీని తట్టుకోగలరని చెప్పారు. ‘వికసిత భారత్’ కోసం ప్రాక్టికల్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఉమా జోసెఫ్ మాట్లాడుతూ.. 1959లో కొద్దిమందితో మొదలైన తమ సంస్థ నేడు 3,500 మంది విద్యార్థులతో నాణ్యమైన విద్యను అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఏఐ ప్రాముఖ్యతను, మాతృభాషలో బోధన గురించి పలువురు నిపుణులు వివరించగా, ఒక ప్రత్యేక సావనీర్ను కూడా ఆవిష్కరించారు.

