
సత్తుపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన పండూరి అనూష ఆరు నెలల గర్భిణి. వైద్య పరీక్షల కోసం ఈ నెల 19న సత్తుపల్లి టౌన్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. మహిళా డాక్టర్ పరీక్షించి రెఫర్ చేయడంతో అల్ఫా స్కానింగ్ సెంటర్ కు వెళ్లింది. సెంటర్ నిర్వాహకులు అనూషకు స్కానింగ్ చేసి.. 9 నెలల గర్భిణి జ్యోతి రిపోర్టులను అందించారు. వాటిని తీసుకుని మహిళా డాక్టర్ వద్దకు వెళ్లిన అనూష రిపోర్టులు పరిశీలించి మెడిసిన్ రాయడంతో తీసుకుని వెళ్లి వాడింది.
దీంతో గర్భిణికి కడుపులో నొప్పి వచ్చింది. వారం అనంతరం అనూషకు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఫోన్ చేసి తమ రిపోర్ట్ ఒకటి మీ వద్ద ఉందని, వెంటనే తెచ్చి ఇవ్వాలని కోరారు. ఆ రిపోర్టులో అనూష కాకుండా మరో గర్భిణి జ్యోతి పేరు ఉంది. అవాక్కైన మహిళా డాక్టర్ వద్దకు అనూషతో పాటు కుటుంబసభ్యులు వెళ్లి ప్రశ్నించగా తనకేమీ తెలియదని, పేర్లు చూడలేదని, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులను అడగాలని చెప్పి పంపించారు. సెంటర్ నిర్వాహకుల వద్దకు వెళ్లి ప్రశ్నించడంతో దురుసుగా సమాధానమిస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో గర్భిణి కుటుంబ సభ్యులు స్కానింగ్ సెంటర్ వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు.
ప్రైవేట్ ఆస్పత్రి మేనేజ్ మెంట్, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు కుమ్మక్కై పేషెంట్ల ప్రాణాల మీదకు తెస్తున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులను కోరారు. దీంతో శనివారం డిప్యూటీ డీఎంహెచ్ ఓ సీతారాం వెళ్లి ఆల్ఫా స్కానింగ్ సెంటర్ ను తనిఖీ చేశారు. రేట్ల పట్టిక లేదని, పేషెంట్లకు కనీస సౌకర్యాలు లేవని, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై మండిపడ్డారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.