కరోనా భయం: గర్భిణీని ఇంట్లోకి రానియ్యలే

కరోనా భయం: గర్భిణీని ఇంట్లోకి రానియ్యలే
  • ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందకు నిరాకరించిని ప్రైవేటు హాస్పిటల్స్‌
  • కడుపులోనే బిడ్డ మృతి

మంగళూరు: కరోనా వస్తుందనే భయం మనిషిలోని మానవత్వాన్ని చంపేస్తోంది. తమకు ఎక్కడ వ్యాధి సోకుతుందో అని భయానికి గురిచేసి తోటివారికి సాయపడకుండా చేస్తోంది. దుబాయ్‌ నుంచి వచ్చిన గర్భిణీకి కరోనా నెగటివ్‌ వచ్చినప్పటికీ అపార్ట్‌మెంట్‌లోకి రానీయకపోవడంతో ఆమె తన బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. మంగళూరుకు చెందిన ఒక మహిళ ఈ నెల 12న వందే భారత్‌ ఫ్లైట్‌లో ఇక్కడికి వచ్చారు. ఎయిర్‌‌పోర్ట్‌ నుంచి నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌‌కు వెళ్లి కరోనా రిజల్ట్‌ నెగటివ్‌ వచ్చిన తర్వాత తన సొంత ఇంటికి వెళ్లారు. అపార్ట్‌మెంట్‌లోని వారు ఆమెను అనుమతించలేదు. ఈ టెంక్షన్‌లో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లగా ఆమెను ఎవరూ చేర్చుకోలేదు. మహిళ పరిస్థితి విషమించి కడుపులోని బిడ్డ చనిపోయింది. “ కరోనా పరీక్షలు చేయించుకోని ఆమెకు కరోనా లేదని తేలిన తర్వాత ఇంటికి వచ్చింది. కానీ అపార్ట్‌మెంట్‌ సొసైటీ వాళ్లు ఆమెను అనుమతించలేదు. హాస్పిటల్‌కు తీసుకెళ్తే చేర్చుకోలేదు. చేసేదేమీ లేక హోటల్‌లో ఉంచాం. అక్కడ ఆమె పరిస్థితి సీరియస్‌ అయింది. దగ్గర్లో హాస్పిటల్స్‌ కూడా ఏమీ లేదు. చివరికి ఒక హాస్పిటల్‌లో చేర్చగా.. అప్పటికే కడుపులో బిడ్డ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు” అని బాధితురాలి అత్త మీడియాతో చెప్పారు. ఈ ఘటనపై మంగళూరు కార్పొరేషన్‌ కమిషనర్‌‌ సీరియస్‌ అయ్యారు. అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేశారు. ఆమెను ఇంటికి రానీకుండా అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామన వార్నింగ్‌ ఇచ్చారు.