రాష్ట్రంలో కొత్త పార్టీ.!.. 20-25 మంది లీడర్లతో ఏర్పాటుకు సమాలోచనలు

రాష్ట్రంలో కొత్త పార్టీ.!.. 20-25 మంది లీడర్లతో ఏర్పాటుకు సమాలోచనలు
  • జోరుగా రాయబారాలు, మంతనాలు.. కొనసాగుతున్న సర్వేలు
  • కర్నాటక ఎన్నికల రిజల్ట్‌‌‌‌‌‌‌‌తో అన్ని పార్టీల్లో కన్ఫ్యూజన్
  • జోష్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్.. షాక్‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్.. బలాబలాల బేరీజులో బీజేపీ
  • బీజేపీ, కాంగ్రెస్ ఆఫర్లను తిరస్కరిస్తున్న బీఆర్ఎస్ అసంతృప్త నేతలు
  • ఏదో పార్టీలో చేరే బదులు.. లీడర్లను ఒక్కటి చేసేందుకు సంప్రదింపులు
  • ‘జనం తెలంగాణ’ నినాదంతోనే కొత్త పార్టీ ఏర్పడే అవకాశం! 


హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో మరో పొలిటికల్ పార్టీ ఏర్పాటుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఓ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసేందుకు తెర వెనుక సమాలోచనలు సాగుతున్నాయి. కొత్త పార్టీలో ఎవరు చేరబోతున్నారు? ఎవరు నాయకత్వం వహిస్తారు? అనేది స్పష్టత రానప్పటికీ రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న 20 నుంచి 25 మంది లీడర్లు ఈ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవలి కర్నాటక ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ఎన్నికలకు మరో ఆరు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ కన్ఫ్యూజన్‌‌‌‌‌‌‌‌లో పడ్డాయి. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో జోష్​ పెరిగిపోగా.. అధికార బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు షాక్ తగిలినంత పనైంది. కొంతకాలంగా వరుస విజయాలతో ఊపు మీద ఉన్న బీజేపీ.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను బేరీజు వేసుకునే పనిలో పడింది. 

ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది? అనే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు జరుగుతుండటం ఆసక్తిని రేపుతున్నది.25 సీట్లు గెలవాలనే వ్యూహంతో..
బీఆర్ఎస్‌‌‌‌పై తిరుగుబాటు జెండా ఎగరేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో రాజకీయంగా, ఆర్థికంగా బలమైన లీడర్‌‌‌‌‌‌‌‌గా పేరున్న ఆయన ప్రత్యాయ్నాయ ఆలోచనలో ఉన్నట్లు రెండు నెలలుగా ప్రచారం సాగుతున్నది. తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు పలుమార్లు ఆఫర్లు ఇచ్చినా.. పొంగులేటి ఆసక్తి చూపలేదు. సంప్రదింపుల కోసం వెళ్తే.. పొంగులేటి ఉల్టా తమనే కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయా పార్టీల లీడర్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో మరో పార్టీ రాబోతున్నదనే ఊహాగానాలకు బలం చేకూరుతున్నది. కొందరు ప్రధాన పార్టీల నేతలను కలుపుకొని.. తామే ఓ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో పొంగులేటి సర్వేలు చేయించుకుంటున్నారని తెలుస్తున్నది. ఖమ్మం జిల్లాలో తనకు బలం ఉన్నప్పటికీ.. ఇతర జిల్లాల్లో బలమైన లీడర్లు ఎవరైనా కలిసి వస్తారా? అనే విషయాలపై  సర్వే ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. పొంగులేటితోపాటు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటివరకు ఏ పార్టీలో చేరలేదు. ఆయన పొంగులేటితో కలిసి.. బీఆర్ఎస్‌‌‌‌కు వ్యతిరేకంగా సభల్లో పాల్గొంటున్నారు. ఇదే తరహాలో వివిధ జిల్లాల్లో ప్రజాదరణ, రాజకీయాల్లో పట్టున్న లీడర్లు ప్రత్యామ్నాయ పార్టీ దిశగా  సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 20, 25 సీట్లను గెలుచుకునే వ్యూహంతో.. వివిధ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలు ఒక్కటయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. కనీసం 20 నుంచి 25 సీట్లను గెలిస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించవచ్చనేది కొత్త పార్టీ వ్యూహంగా కనిపిస్తున్నది. పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో పోటీ చేయటం భారీగా డబ్బులతో ముడిపడి ఉన్న పని కావటంతో పొంగులేటితో పాటు.. ఆర్థికంగా బలంగా ఉన్న మరి కొందరు సీనియర్లు కొత్త పార్టీలో ఉంటారని, అదే దిశగా మంతనాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతున్నది.

కాంగ్రెస్ నుంచి కూడా..

కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి క్రేజ్ పెరిగింది. అయితే ఆ పార్టీలో చేరేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. గ్రూపు రాజకీయాలు, ఐక్యత లేకపోవడంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సీనియర్లు కొత్తగా ఏర్పాటయ్యే పార్టీ వైపు చూస్తున్నారు. ‘జనం తెలంగాణ’ నినాదంతోనే కొత్త పార్టీ ఏర్పడే అవకాశముందని తెలుస్తున్నది. ఉద్యమ సమయంలో ప్రజలు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలేవీ నెరవేరకపోగా.. పదేండ్లలో తెలంగాణ అప్పులు, అవినీతిలో కూరుకుపోయింది. ఉద్యమంతో తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు ప్రశ్నిస్తే అణచివేసే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యమం నాటి నీళ్లు, నిధులు, నియామకాల కల సాకారం కాలేదని చాటిచెప్పటంతో పాటు అవినీతిలో కూరుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఎజెండాతోనే కొత్త పార్టీకి రూపకల్పన జరుగుతున్నదని తెలుస్తున్నది.