
- ఈ నెల 18 నుంచి 25 వరకు నిలయంలో బస
- 11వ తేదీ నుంచే సందర్శనలకు నో ఎంట్రీ
సికింద్రాబాద్, వెలుగు : రాష్ట్రపతి శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ముస్తాబువుతోంది. ఈనెల18 నుంచి 25 వరకు అందులో రాష్ట్రపతి దౌపది ముర్ము బస చేస్తారు. ప్రతి ఏటా రాష్ర్టపతి శీతాకాల విడిదికి ఇక్కడికి రావడం సంప్రదాయంగా వస్తుంది. అదేవిధంగా దక్షిణాది రాష్ర్టాలలో కూడా ఆమె పర్యటిస్తారు. ఇప్పటికే రాష్ట్రపతి నిలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆవరణలోని అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేసి రోడ్డుకు ఇరువైపులా రంగులు వేస్తున్నారు.
రాష్ర్టపతి రాక నేపథ్యంలో నిలయంలోని ఆవరణలో పాములను పట్టి అటవీప్రాంతాల్లో వదిలేశారు. ఇంకా ఎక్కడైనా ఉంటే వాటిని పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్లను కూడా నియమించారు. 162 ఏళ్ల చారిత్రక కట్టడాలు, నిలయంలోని పూల తోటలు, పండ్ల తోటలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక రాష్ర్టపతి విడిదికి వస్తుండగా, ఈ నెల 11 నుంచి 25 వరకు నిలయంలోకి సందర్శకుల ఎంట్రీని నిలిపివేశారు. ఆమె బస పూర్తయి తిరిగిఢిల్లీకి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ సందర్శకులను అనుమతిస్తారు.
అధికారులతో చీఫ్ సెక్రటరీ మీటింగ్
రాష్ట్రపతి శీతాకాల విడిదికి వస్తుండగా నిలయంలో అన్నిరకాల సదుపాయాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సీఎస్ శాంతికుమారి అధికారులతో భేటీ అయ్యారు. జీఏడీ (ప్రొటోకాల్), పోలీసు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్యం తదితర శాఖలు, రోడ్లు, భవనాలు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి తదితర శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లపై బొల్లారంలోని రక్షణ శాఖ అధికారులు, ఎస్సీబీ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం
నిర్వహించారు.
1860లో నిర్మాణం
నిజాం నవాబు నజీరుద్దౌలా 1860లో బొల్లారంలో కంట్రీ హౌజ్ పేరుతో ఈ భవనాన్ని నిర్మించారు. దీన్ని తొలుత బ్రిటీష్ రెసిడెంట్గా వినియోగించారు. 1948లో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైంది. ఆ తర్వాత నుంచి రాష్ట్రపతి నిలయం మారింది. 90 ఎకరాల విస్తీర్ణంలో 16 గదులతో కూడిన రాష్ట్రపతి నిలయంతో పాటు దానిని అనుకుని సందర్శకులు, సిబ్బందికి మరో 5 భవనాలు ఉన్నాయి. రాష్ట్రపతి నిలయంలో వివిధ రకాల పండ్లు, పూల మొక్కలు, 116 రకాల ఔషధ మొక్కలు దర్శనమిస్తాయి. సుగంధ ద్రవ్యాల మొక్కలు, పండ్ల మొక్కలు, మంచినీటి బావులతో గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తుంది.
రాష్ట్రపతి సూచించగా..
రాష్ర్టపతి నిలయంలో ప్రెసిడెంట్విడిది అనంతరం 15 రోజుల పాటు సందర్శకులకు గ తంలో ఉచితంగా ప్రవేశం కల్పించేవారు. రెండేళ్ల కిందటి వరకు ఏడాదిలో ఒకసారి మాత్రమే సందర్శకుల కోసం తెరిచి ఉండేది. గతేడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని నిలయానికి వచ్చి వెళ్లాక, సందర్శకుల కోసం ఏడాదంతా తెరిచి ఉంచాలని అధికారులకు సూచించారు. ఆమె సూచనల మేరకు రాష్ర్టపతి నిలయాన్ని సందర్శకుల కోసం తెరిచి ఉంచేందుకు నిర్ణయించారు.
ఈ ఏడాది మార్చి 23న ఉగాది రోజు నుంచి రాష్ర్టపతి నిలయంలోకి సందర్శకులను అనుమతించారు. తొలుత ఉచితంగానే ప్రవేశం కల్పించగా, ప్రజల రద్దీ పెరిగిపోవడంతో మెయింటెన్స్కింద ప్రవేశ రుసుం పెట్టారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుంది. సందర్శకుల వాహనాల కోసం పార్కింగ్ సదుపాయాలు, వీల్చైర్స్, క్లాక్రూమ్, కేఫ్, రెస్ట్రూమ్లు , ఫ్రీ ఆర్ఓ వాటర్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. రాష్ర్టపతి నిలయం సందర్శనకు వచ్చే వారి నుంచి ఒకరికి రూ.50 ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు. విదేశీయులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.