- మహాత్ముడికి జీ20 లీడర్ల నివాళి
- రాజ్ఘాట్ వద్ద కండువాలు వేసి ఆహ్వానించిన మోదీ
న్యూఢిల్లీ : జీ20 దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఆదివారం ఉదయం రాజ్ఘాట్ వెళ్లారు. రెండో రోజు సమిట్ ప్రారంభానికి ముందే రాజ్ఘాట్ను సందర్శించి, మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించారు. దీనికి ముందు జీ20 దేశాల లీడర్లకు ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయబద్ధంగా కండువాలు వేసి రాజ్ఘాట్లోకి వెల్కమ్ చెప్పారు.
భారతదేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ అహింసాయుతంగా పోరాడిన తీరుతో పాటు సబర్మతి ఆశ్రమ చరిత్రను జీ20 లీడర్లకు మోదీ వివరించారు. వర్షం పడుతున్నా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్తో పాటు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ రాజ్ ఘాట్ చేరుకుని జాతిపితకు శ్రద్ధాంజలి ఘటించారు. వివిధ దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తర్వాత పీస్ వాల్పై అధ్యక్షులు, ప్రధానులు సంతకాలు చేశారు. ఆపై తిరిగి భారత్ మండపానికి వెళ్లిపోయారు. ‘ఐకానిక్ రాజ్ఘాట్లో జీ20 ఫ్యామిలీ మహాత్మా గాంధీకి నివాళులర్పించింది. జాతిపిత పాటించిన శాంతి, సేవ, కరుణ, అహింస మార్గాలను జీ20 లీడర్లకు వివరించాను. గాంధీజీ ఆదర్శాలు.. సామరస్యపూర్వకమైన, సుసంపన్నమైన ప్రపంచ భవిష్యత్తు కోసం ఎంతో తోడ్పడుతాయి” అని మోదీ ట్వీట్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
చెప్పుల్లేకుండా నడిచిన మోదీ, ట్రూడో
ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, యూకే ప్రధాని రిషి సునాక్తో పాటు కొంతమంది జీ20 లీడర్లు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు చెప్పులు లేకుండా రాజ్ఘాట్లో నడిచారు. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వాతో పాటు పలువురు రాజ్ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన స్పెషల్ స్లిప్పర్స్, ఓవర్షూలు వేసుకున్నారు.