- మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శ
అశ్వారావుపేట, వెలుగు : కాళేశ్వరం కడితే కమీషన్ వస్తుందన్న ఆశతో గత ప్రభుత్వం పేదోడి గూడును పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని చెప్పారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పట్టణంలో గురువారం నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు.
అనంతరం స్థానిక పోలీస్స్టేషన్ సెంటర్లో జరిగిన మీటింగ్లో మాట్లాడుతూ... వరి వేస్తే ఉరేనని గత ప్రభుత్వం చెబితే.. ఇందిరమ్మ ప్రభుత్వంలో వరివేసిన రైతులకు రూ. 500 బోనస్ ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ఏర్పడిన రెండేండ్లలో అనేక హామీలు అమలు చేస్తామని చెప్పారు. తొమ్మిది నెలల్లో 26 లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్లను రుణమాఫీ చేశామన్నారు.
రూ.200 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశామని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేటలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రూ.7 కోట్లతో మున్సిపాలిటీ నూతన బిల్డింగ్, రూ.5 కోట్లతో దొంతికుంట చెరువును ఆధునికీకరణను చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. అలాగే మార్కెట్ కాంప్లెక్స్, టాయిలెట్స్, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. అశ్వారావుపేటకు మినీ బస్ డిపోను మంజూరు చేయడమే కాకుండా.. ఆ పనులను త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్లు వివరించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, జూపల్లి రమేశ్, శశికళ, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, తుమ్మా రాంబాబు పాల్గొన్నారు.
