పోలెండ్​కు ప్రధాని మోదీ

పోలెండ్​కు ప్రధాని మోదీ
  • 45 ఏండ్ల తర్వాత ఆ దేశంలో అడుగుపెట్టిన భారత ప్రధాని 
  • రేపు పోలెండ్ నుంచి ఉక్రెయిన్​కు రైల్లో ప్రయాణం
  • ఉక్రెయిన్​కు వెళ్తున్న మొదటి ఇండియన్​ ప్రైమ్​ మినిస్టర్​ కూడా మోదీనే
  • రేపు ఉక్రెయిన్​కు వెళ్లనున్న ప్రధాని 

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పోలెండ్, ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. బుధవారం ఆయన ప్రత్యేక విమానంలో పోలెండ్ రాజధాని వార్సా చేరుకున్నారు. అక్కడ రెండ్రోజుల పర్యటన తర్వాత.. శుక్రవారం ఉక్రెయిన్ వెళ్తారు. గత 45 ఏండ్ల తర్వాత పోలెండ్​కు వెళ్లిన భారత ప్రధాని మోదీనే. చివరిసారి 1979లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆ దేశానికి వెళ్లారు. పోలెండ్, ఉక్రెయిన్ దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తన పర్యటన ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. టూర్ కు వెళ్లేముందు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

సెంట్రల్ యూరప్​లో భారత్​కు పోలెండ్ కీలకమైన ఆర్థిక భాగస్వామి. భారత్, పోలెండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏండ్లయిన సందర్భంగా అక్కడికి వెళ్తున్నాను. ఆ దేశ ప్రెసిడెంట్ ఆండ్రెజ్ దుడా, ప్రధాని డొనాల్డ్ టస్క్​తో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నాను. పోలెండ్​లోని ఇండియన్స్ తోనూ సమావేశం కానున్నాను” అని మోదీ పేర్కొన్నారు. 

అక్కడి నుంచి రైల్లో ఉక్రెయిన్​కు.. 

ప్రధాని మోదీ శుక్రవారం పోలెండ్​ నుంచి ఉక్రెయిన్ వెళ్తారు. దాదాపు 10 గంటలు రైల్లో ప్రయాణం చేసి ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకుంటారు. ఉక్రెయిన్ కు వెళ్తున్న మొదటి భారత ప్రధాని మోదీనే. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నట్టు మోదీ తెలిపారు.