PM Modi:  కాసేపట్లో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష

PM Modi:  కాసేపట్లో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష

ఢిల్లీ : ఇండియాలో కరోనా కేసులు (Corona cases) మళ్లీ పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కరోనా కేసులు, H3N2 వైరస్ నియంత్రణపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు.  కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలోనే 1,134 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 7,026 కి చేరింది. 

మార్చి 21న దేశవ్యాప్తంగా 1,03,831 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1,134 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా కరోనా కారణంగా ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు కొవిడ్‌తో ప్రాణాలు విడిచినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 95.05 కోట్ల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా..  4,46,98,118మందిలో వైరస్‌ ఉన్నట్టు తేలినట్టు కేంద్ర గణాంకాలు పేర్కొంటున్నాయి.  

మార్చి 21న దేశ వ్యాప్తంగా 662మంది కోలుకోవడంతో మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,41,60,279కి (రికవరీ రేటు 98.79శాతం) చేరింది.  రోజువారీ పాజిటివిటీ రేటు 1.09%గా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.98%గా ఉంది.  దేశంలో కొవిడ్‌ మరణాల రేటు 1.19శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఇప్పటివరకు 220.65కోట్ల డోసుల కొవిడ్‌ టీకాను పంపిణీ చేశారు.