వైస్ ప్రెసిడెంట్ పోలింగ్..ఓటేసిన మోడీ

వైస్ ప్రెసిడెంట్ పోలింగ్..ఓటేసిన మోడీ

ఢిల్లీ: వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక పోలింగ్  కొనసాగుతోంది. ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ఎంపీలు కూడా ఓటేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 5 గంటల తర్వాత ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఎన్డీఏ అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, విప‌క్షాల అభ్య‌ర్థిగా మార్గ‌రేట్ అల్వాలు పోటీప‌డుతున్నారు. సాయంత్రం దేశానికి కొత్త ఉపాధ్యక్షుడి పేరును రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. కొత్త ఉపరాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది.

80 ఏళ్ల వయసున్న మార్గరెట్‌ ఆల్వా కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకురాలు . రాజస్థాన్‌ గవర్నర్‌గా పని చేశారు. 71 ఏళ్ల వయసున్న జగ్‌దీప్‌ రాజస్థాన్‌కు చెందిన జాట్‌ నాయకుడు.  మార్గరెట్‌ ఆల్వాకు కాంగ్రెస్‌, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్‌ఎస్‌, ఆప్‌ మద్దతు తెలుపుతున్నాయి.  జేడీయూ, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థికి 515 ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయి. ఎన్డీఏ పక్షాల అభ్యర్థి జగదీప్ దన్కర్ కు వైసీపీ, టీడీపీ, బీఎస్పీ, ఏఐఎడిఎంకే, శివసేన, బీజేడీ, ఆర్ఎల్జెపి మద్దతు తెలిపారు.

ఓటింగ్ కు దూరంగా టీఎంసీ

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము భాగస్వాములం కావడం లేదని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ గురువారం అన్నారు. ఎన్డీయే(ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధంఖర్)కు మద్దతిచ్చే ప్రశ్నే లేదని ఆయన అన్నారు. ఎన్‌డీఏ (వీపీ) అభ్యర్థికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్న అభిషేక్... ఉభయ సభలలో 35 మంది ఎంపీలు ఉన్న పార్టీతో సరైన సంప్రదింపులు, చర్చలు జరపలేదన్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష అభ్యర్థిని నిర్ణయించే విధానంతో ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలని మేము ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నామని అభిషేక్ బెనర్జీ తెలిపారు.