రేపు పీఎంకేర్స్ చిల్డ్రన్ స్కాలర్ షిప్ లు విడుదల

రేపు పీఎంకేర్స్ చిల్డ్రన్ స్కాలర్ షిప్ లు విడుదల

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ప్రయోజనాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపు (మే 30వ తేదీన) విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన పాస్ బుక్ తో పాటు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డును కూడా ఇవ్వనున్నారు. కోవిడ్ విజృంభణ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రారంభించింది.

దేశంలో కోవిడ్ విజృంభణ మొదలైన 2020 మార్చి నుంచి 2022 ఫిబ్రవరి మధ్య కాలంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత పిల్లలను ఆదుకునేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని 2021 మే 29వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సమగ్ర రక్షణలో భాగంగా బాధిత పిల్లలకు వసతి కల్పించడం, విద్యా, స్కాలర్ షిప్స్ అందించి వారికి మద్దతుగా నిలవడం, ఉన్నత చదువుల్లోనూ సహాయం చేయడం, 23 ఏళ్ల వయసు వచ్చే నాటికి ఆర్థికంగా స్వయం సమృద్ధి చెందేలా రూ.10 లక్షల సాయంతో అందించడంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడం వంటి ప్రయోజనాలను ఈ పథకం ద్వారా అందించనున్నారు. ఇందులో పేరు నమోదు కోసం పీఎంకేర్స్ ఫర్ చిల్డ్రన్.ఇన్ పేరుతో ప్రత్యేక పోర్టల్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ పథకం ప్రయోజనాలను మే 30వ తేదీన బాధిత పిల్లలకు అందించే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి

బిహార్ లో భారీ గోల్డ్ మైన్