
హైదరాబాద్, వెలుగు: అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు హాస్పిటల్కు వెళ్తే ట్రీట్మెంట్ అందించే దిక్కు లేకుండాపోతోంది. కనీసం నాడీ పట్టి చూడటానికి, ఆక్సిజన్ పెట్టడానికి కూడా అక్కడివాళ్లు ముందుకు రావడం లేదు. పేషెంట్లకు ఎక్కడ కరోనా ఉందోనన్న భయంతో కొన్ని హాస్పిటళ్లు ట్రీట్మెంట్కు నిరాకరిస్తున్నాయి. బెడ్లు లేవని చెప్పి వెనక్కి పంపుతున్నాయి. దీంతో బుధవారం హైదరాబాద్లో ఇద్దరు చనిపోయారు.
పేషెంట్తో గంటలపాటు హాస్పిటళ్ల చుట్టూ..!
మలక్పేటలోని సలీంనగర్కు చెందిన వృద్ధురాలు (70) నాలుగు రోజుల కింద శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడింది. దమ్ము, ఆయాసంతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు దిల్సుఖ్నగర్, కొత్తపేటలోని ప్రైవేట్ హాస్పిటళ్లకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లను బతిమిలాడినా, కాళ్లావేళ్లా పడినా చేర్చుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం ఉదయం మళ్లీ దమ్ము రావడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడివారు నిరాకరించడంతో మరో హాస్పిటల్కు.. అక్కడ కూడా నో చెప్పడంతో ఇంకో హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆ మూడు హాస్పిటళ్లలో డాక్టర్లు పట్టించుకోలేదు. చివరకు మలక్పేటలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్కు తీసుకెళ్లగా.. సెల్లార్లోని అంబులెన్స్ వద్దకు డాక్టర్ వచ్చి పరీక్షించగా అప్పటికే ఆమె చనిపోయింది. కొన్నిగంటలపాటు హాస్పిటళ్ల చుట్టూ అమ్మను తీసుకొని తిరిగామని, ఆక్సిజన్ పెడితే బతికేదని ఆ వృద్ధురాలి కుమారుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
బెడ్లు లేవని పంపించేశారు..!
నల్లకుంటలోని తిలక్నగర్కు చెందిన శ్రీనివాస్ రావు (67) నాలుగు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. బుధవారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు సెక్రటేరియట్ సమీపంలోని, నాంపల్లిలో, కాచిగూడలోని ప్రముఖ హాస్పిటళ్లకు తీసుకెళ్లారు. ఆ హాస్పిటళ్ల నిర్వాహకులు అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించారు. బెడ్లు లేవని వెనక్కి పంపారు. చివరికి కుటుంబ సభ్యులు ఉస్మానియా హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించి చనిపోయాడు. ఇటీవల గద్వాల జిల్లాకు చెందిన గర్భిణికి డెలివరీ చేయడానికి ప్రైవేటు హాస్పిటళ్లు నిరాకరించడంతో.. తల్లీబిడ్డ చనిపోయారు. అదేవిధంగా హైదరాబాద్లోని అత్తాపూర్కు చెందిన రోహిత అనే మహిళ కూడా ట్రీట్మెంట్ అందక ప్రాణాలు విడదిచింది.