- మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాస్ రావు
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాలో మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డుకు సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అన్నారు. శనివారం మెదక్ కలెక్టరేట్లో రోడ్డు సేఫ్టీ, మత్తు పదార్థాల నిర్మూలనపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతీ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ఆయా శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు రోడ్లపై పెండింగ్లో ఉన్న గుంతలను పూడ్చడంతో పాటు రోడ్డు సిగ్నల్స్, సైన్బోర్డులు, స్ట్రీట్లైట్లు తదితర పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో, కళాశాలలో రోడ్డు భద్రత నియమాల గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటింయాలన్నారు. విద్యాలయాల్లో, మెడికల్ షాపుల్లో, పరి శ్రమల్లో మత్తు పదార్థాలపై నిఘా పెట్టామన్నారు.
ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగాలి
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు ప్రక్రియపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం ఆమె మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు దళారులను ఆశ్రయించవద్దన్నారు. ప్రభుత్వం క్వింటాల్- ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389 , సాధారణ రకానికి రూ. 2,369 గా నిర్ణయించిందని, ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. ఈ యాసంగిలో 4, 45, 466 టన్నుల ధాన్యాన్ని సేకరణ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 413 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
