కొడుకుతో సహా చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య

కొడుకుతో సహా చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య

వరంగల్ క్రైం, వెలుగు: మానసిక వ్యాధితో బాధ పడుతున్న ఓ ప్రైవేట్​టీచర్​తన కొడుకుతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..హనుమకొండ కనుకదుర్గ కాలనీకి చెందిన శీలమంతుల రవీందర్(38) నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్​లో మ్యాథ్స్​ టీచర్. ఈయనకు  ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీచరణ్(8) అదే స్కూల్​లో నాలుగో తరగతి చదువుతున్నాడు. రవీందర్ దాదాపు రెండేండ్ల నుంచి మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. 

ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో  మూడు రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం స్కూల్​కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తన కొడుకు శ్రీచరణ్​ని తీసుకుని బయటకు వెళ్లాడు. స్కూల్​ టైం ముగిసినా ఇంటికి రాకపోవడంతో రవీందర్​ కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. సెల్​ఫోన్​ స్విచ్ఛాఫ్​ రావడంతో అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవీందర్ బైక్​ పెద్ద వడ్డేపల్లి చెరువు దగ్గర కనిపించడంతో స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు చెరువు పరిసర ప్రాంతాల్లో  గాలించగా ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చి కనిపించాయి. మృతుడు రవీందర్​ భార్య దివ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సుబేదారి పోలీసులు తెలిపారు.