ఢిల్లీ : రాజ్యసభ ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఐదుగురు సభ్యులు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. సోమవారం (ఆగస్టు 7న) ఢిల్లీ సర్వీసెస్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. మంగళవారం (ఆగస్టు 8న) ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానంపై సంతకం చేసిన ఎంపీల పేర్లను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ చదువుతుండగా.. ఐదుగురు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఆ సంతకాలు చేయలేదని.. తమ సంతకాలను రాఘవ్ చద్దా ఫోర్జరీ చేశారని ఆరోపించారు. అనంతరం ఐదుగురు ఎంపీలు సస్మిత్ పాత్రా, ఫాంగ్నాన్ కాగ్నాక్, తంబిదురై, నర్హారి అమిన్, సుధాన్షు త్రివేదిలు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఛైర్మన్ విచారణకు ఆదేశించారు. ఎంపీల ఫిర్యాదు అంశంపై చర్చించేందుకు బుధవారం (ఆగస్టు 9న) సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ రాఘవ్ చద్దాకు నోటీసులు జారీ చేసింది.