- ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడి
న్యూఢిల్లీ: బ్యాంకులను మోసగించిన కేసులో ఏబీజీ షిప్ యార్డుకు చెందిన రూ. 2,747 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. దేశంలోని బ్యాంకులను మోసగించి అప్పులు తీసుకున్న ఈ కంపెనీ అక్రమ మార్గాలలో ఆ డబ్బును వేరే అకౌంట్లకు తరలించిందనే ఆరోపణలనూ ఎదుర్కొంటోంది. దీంతో మనీలాండరింగ్ కేసును ఈడీ రిజిస్టర్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తులు సూరత్, దహేజ్లలోని షిప్ యార్డులతో పాటు గుజరాత్లోని ఇతర ప్రాంతాలలో ప్లాట్లు, కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రోపర్టీలూ ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్, ఆ గ్రూప్లోని ఇతర కంపెనీలు, సంబంధిత సంస్థల బ్యాంకు అకౌంట్లనూ అటాచ్ చేసినట్లు పేర్కొంది.
ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమ్లేష్ అగర్వాల్ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ సహా బ్యాంకుల కన్సార్టియం నుంచి ఈ గ్రూప్ భారీగా అప్పులు తీసుకుంది. తీసుకున్న అప్పులను సక్రమంగా వాడకుండా, ఇతర అవసరాల కోసం వాటిని మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్, ఆ గ్రూప్లోని ఇతర కంపెనీలు బెర్మాకో ఎనర్జీ సిస్టమ్స్, థనంజయ్ దతార్, సవితా ధనంజయ్ దతార్, క్రిష్ణ గోపాల్ తోష్ణివాల్, వీరేన్ అహూజా ఇతరుల ఆస్తులు అటాచ్ చేసిన వాటిలో ఉన్నాయని ఈడీ తెలిపింది. ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ షిప్ బిల్డింగ్ రంగంలో కార్యకాలాపాలు నిర్వహిస్తోంది. 16 ఏళ్లలో మొత్తం 165 వెసెల్స్ను ఈ కంపెనీ తయారు చేసింది.