- దివిటిపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులపై నిరసన
- ఇండ్లు ఎప్పుడు ఇస్తారని నిలదీసిన లబ్ధిదారులు
మహబూబ్ నగర్, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి దగ్గర్లోని దివిటిపల్లిలో 1,024 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి కేవలం వంద ఇండ్లు మాత్రమే కేటాయించడంతో లబ్ధిదారులు నిరసనకు దిగారు. మంగళవారం గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఈ ఇండ్లను ప్రారంభించారు. ఇదివరకే అర్హులైన లబ్ధిదారుల జాబితాను ప్రకటించిన అధికారులు వారిని ఆహ్వానించారు. అందరూ వచ్చిన తర్వాత లాటరీలో వంద మందినే ఎంపిక చేశారు. కొందరితోనే గృహప్రవేశాలు చేయించారు. తాము తమ పట్టాలను వాపసు ఇచ్చామని, అయినా తమకు ఇండ్లు కేటాయించకపోవడం ఏంటని వారు పట్టాకాగితాలతో అధికారులను నిలదీశారు. తమకు ఇండ్లు ఎప్పుడిస్తారని నిరసనకు దిగారు. అధికారులు వారికి సర్ది చెప్పి పంపించారు.