
శామీర్ పేట వెలుగు : ‘‘ఎలక్షన్లప్పుడే మా గ్రామాలు గుర్తుకొస్తాయి. దత్తత తీసుకొని ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేయలేదు. మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి చేస్తామన్నా నమ్మకం లేదు” అని శామీర్ పేటలోని పెద్దమ్మకాలనీ వాసులు మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డిపై మండిపడ్డారు. బుధవారం శామీర్ పేట మండలంలో మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. తాను దత్తత తీసుకున్న పెద్దమ్మ కాలనీకి వెళ్లి మల్లారెడ్డి మాట్లాడుతూ మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే పెద్దమ్మ కాలనీని మోడల్ కాలనీగా మారుస్తానని అనడంతో మహిళలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తంచేశారు. గత హామీలపై మంత్రిని నిలదీశారు.ఇష్టమొచ్చింది మాట్లాడితే వినం అంటూ మండిపడ్డారు. దీంతో మల్లారెడ్డి అక్కడినుంచి వెళ్లిపోయారు.