కనకగిరిలో వన్యప్రాణుల కదలికలు...పులిగుండాల ప్రాజెక్ట్ సమీపంలో స్వేచ్ఛగా సంచారం

కనకగిరిలో వన్యప్రాణుల కదలికలు...పులిగుండాల ప్రాజెక్ట్ సమీపంలో స్వేచ్ఛగా సంచారం

పెనుబల్లి, వెలుగు: వన్యప్రాణుల సంచారంతో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కనకగిరి అటవీ ప్రాంతం కనువిందు చేస్తోంది. ఈ ప్రాంతంలో వివిధ వన్యప్రాణులు సంచరిస్తున్న దృశ్యాలు అటవీ శాఖ కెమెరాలకు చిక్కాయి. పులిగుండాల ప్రాజెక్ట్ సమీపంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీక్రెట్ కెమెరాల్లో చిరుత పులులు, ఎలుగుబంటి, అరుదైన జింకలు కనిపించినట్లు డీఎఫ్‌‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ చెప్పారు. ఎకో టూరిజం కృషితో వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నీటి గుంటలు తవ్వించినట్లు తెలిపారు. 

సమస్యాత్మక ప్రాంతాల్లో 360 డిగ్రీల నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి వేటగాళ్ల కదలికలపై అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వన్యప్రాణుల కదలికలను గమనించేందుకు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. వన్యప్రాణులు కనిపిస్తే ఎలాంటి హాని తలపెట్టవద్దని, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని డీఎఫ్‌‌వో కోరారు.